ప్రత్యేక హోదా తప్ప మోడీ ఏదడిగినా ఇస్తారు .. కన్నా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయము అని కన్నా లక్ష్మీనారాయణ అభివర్ణించారు. ఈనెల 9న ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఆయనేమైనా మాట్లాడతారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.ఇక ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు.
మోడీ తిరుమల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన కన్నా లక్ష్మీ నారాయణ
ఈ నెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి రాబోతున్నట్లు చెప్పారు .9వ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుపతికి మోడీ చేరుకుంటారని, బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అనంతరం తిరుమలకు వెళతారని , పద్మావతి గెస్ట్ హౌస్ లో మోదీ కాసేపు విశ్రాంతి తీసుకుంటారని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు వెళతారని వివరించారు. స్వామివారి దర్శనం అనంతరం మోడీ రాత్రి 8 గంటలకు తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లిపోతారని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా అంశం ఒక ముగిసిన అధ్యాయం అన్న కన్నా సంచలన వ్యాఖ్యలు
ఇక మోడీ ఏపీకి రానున్న నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మోడీని ఒప్పించేలా ప్రయత్నం చేయాలని ఓ డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రత్యేక హోదా అంశం ఒక ముగిసిన అధ్యాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా అనే అంశం గురించి ఎవరు ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు అంటూ పేర్కొన్నారు. అయితే ప్రత్యేక హోదా కావాలని సీఎం జగన్ అడగడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంలో నిర్ణయం మారదు ... ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న కన్నా
మొత్తానికి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదాపై చిగురించిన ఆశలపై నీళ్లు చల్లారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ ఆయన తేల్చి చెప్పారు. ఏపీలో చంద్రబాబు పాలన ముగిసి, జగన్ పాలన మొదలైనప్పటికీ, జగన్ కేంద్ర ప్రభుత్వంతో స్నేహ సంబంధాలు నెరిపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ స్టాండ్ ఏమాత్రం మారదని ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.