17 నెలలు జైల్లో ఉన్నా: వెంకయ్య నాయుడు, ఎమర్జెన్సీ టైంలో ప్రధాని మోడీ ఏం చేశారంటే?
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ సమయంలో తాను 17 నెలల పాటు జైల్లో ఉన్నానని తెలుగు బిడ్డ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన అత్యయికస్థితి (ఎమర్జెన్సీ) గురించి నేటి తరం తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఎ సూర్యప్రకాశ్ రచించిన 'ఎమర్జెన్సీ: ఇండియన్ డెమోక్రసీ డార్కెస్ట్ అవర్' అనే పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు.
ఎమర్జెన్సీ డే: ఇందిరా గాంధీని హిట్లర్తో పోల్చిన అరుణ్ జైట్లీ
ఈ సందర్భంగా మాట్లాడారు. అయిదేళ్లకోసారి ఓటు వేస్తూ రాజకీయ నాయకులను వదిలేస్తే కుదరదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అన్ని స్థాయిల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కలహాల పేరుతో రాత్రికి రాత్రే దేశంలో ఎమర్జెన్సీ విధించారని వాపోయారు.
ప్రజాస్వామ్యబద్దంగా తీర్పు ఇచ్చారు
ఎమర్జెన్సీ విధించిన 21 నెలల కాలంలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని వెంకయ్య నాయుడు అన్నారు. దానికి వ్యతిరేకంగా 1977 ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా తీర్పు ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యం పట్టాలు తప్పితే ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ఈ పుస్తకం చెబుతుందన్నారు.
సుప్రీం కోర్టు స్టే
లోకసభకు ఎన్నికైన నాడి ప్రధానికి వ్యతిరేకంగా 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్టే విధించి, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనవద్దని నాటి ప్రధానిని ఆదేశించిందని తెలిపారు.
జైల్లో ఉన్నా
దీంతో ప్రధానమంత్రి రాజీనామా చేయాలని అప్పుడు అన్ని పక్షాలు పట్టుబట్టాయని, దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ సంపూర్ణ క్రాంతికి పిలుపునిచ్చారని చెప్పారు. తాను ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని జైల్లో ఉన్నానని చెప్పారు.
ప్రధాని మోడీ ఏం చేశారంటే
జయప్రకాశ్ నారాయణ, బీజేపీ అగ్రనేతలు వాజపేయి, అద్వానీ సహా చాలామందిని జైల్లో పెట్టారన్నారు. ఆ సమయంలో తాను విద్యార్థిని అని, రెండు నెలలు అజ్ఞాతంలో ఉన్నానని, తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు. విపక్ష నేతలు, రచయితలు, జర్నలిస్టులతో తనకు సాన్నిహిత్యం పెరిగిందన్నారు.ఎమర్జెన్సీ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆరెస్సెస్ ప్రచారక్గా ఉన్నారని చెప్పారు. అజ్ఞాతంలోకి వెళ్లి జైలులో ఉన్నవారి కుటుంబాలను ఆదుకునే విషయంలో మోడీ కీలక పాత్ర పోషించారని సూర్యప్రకాశ్ తన పుస్తకంలో రాశారని వెంకయ్య తెలిపారు.