గంజాయి అక్రమ దందా... పశువుల దాణామాటున రవాణా
కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ మధ్య అంబులెన్స్ లో , బొగ్గు లారీలో , సిమెంట్, ఇటుకల లారీలలో గంజాయి అక్రమ రవాణా జరిగితే ఇప్పుడు పశువుల దాణా మాటున గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారు గంజాయి స్మగ్లర్లు .
రోజుకో కొత్త ప్లాన్ తో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలు
మానవాళి మనుగడకు విఘాతం కలిగించే మాదకద్రవ్యాల మహమ్మారి గంజాయి .అటువంటి గంజాయి అక్రమ రవాణా తెలుగు రాష్ట్రాల్లో ఎంత పటిష్టమైన నిఘా ఉన్నా విచ్చలవిడిగా జరుగుతుంది. స్మగ్లర్లు ఎవరికీ దొరకకుండా రోజుకో మార్గాన్ని గంజాయి తరలింపుకు ఉపయోగించుకుంటున్నారు. పక్కా సమాచారం ఉంటే తప్ప గంజాయిని పట్టుకోలేని పరిస్థితి . విశాఖ ఏజెన్సీలో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతుంది. ఇక అక్కడ నుండి పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. ఎన్ని సార్లు పట్టుబడినా మళ్ళీ మళ్ళీ దందా చేస్తూనే ఉన్నారు. రోజుకో కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు గంజాయి రావాణాదారులు అనుమానం రాకుండా గంజాయిని రవాణా చేస్తున్నారు.
లారీలో తరలిస్తున్న లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
పశువుల దాణా మాటున పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు . విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు లారీలో రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన నారాయణ అలియాస్ మహబూబ్ను అరెస్ట్ చేశారు. లారీ యజమాని కూడా అతడేనని పోలీసులు తెలిపారు. పశువుల దాణాతో పాటుగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు అనుమానం రాకుండా జరుగుతున్న గంజాయి దందాకు షాక్ తిన్నారు. లక్షల విలువ చేసే గంజాయి నిత్యం రవాణా అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు .
815 కేజీల బరువున్న శీలావతి రకం గంజాయి విలువ దాదాపు రూ.81.40 లక్షలు
లారీలో గంజాయి అక్రమ రవాణా చెయ్యటానికి పెసరపొట్టు, మినపపొట్టు, వరిపొట్టు బస్తాలను పైన వేసి . దిగువన గంజాయి బస్తాలను ఉంచారు. ఒకవేళ ఎవరైనా అధికారులు పరిశీలించినా పొట్టు బస్తాలే కనిపించేలా పక్కా ప్లాన్ తో గంజాయిని తరలిస్తున్నారు. ఇక ఎక్సైజ్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని పరిశీలించిన పోలీసులు నాణ్యమైన శీలావతి రకం గంజాయిగా గుర్తించారు. 815 కేజీల బరువున్న ఈ గంజాయి విలువ మార్కెట్లో రూ.81.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇక ఆ లారీకి ముందు హెల్మెట్ పెట్టుకుని బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి ఎస్కార్ట్ గా వ్యవహరించారు . అతను లారీకి దారిచూపినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడు నర్సీపట్నానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న పోలీసులు అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
గంజాయి సాగుకు చెక్ పెడితే ఈ దందాకు కొంత చెక్ పడినట్టే
గంజాయి దందాకు చెక్ పెట్టాలని ఎవరు ఎంత ప్రయత్నం చేసినా స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా చేస్తున్న హైటెక్ ముఠాను పట్టుకోవాల్సిన అవసరం వుంది.ఇప్పటికైనా గంజాయి దందాపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అసలు సాగు చెయ్యకుండా నిలువరించగలిగితే ఈ దందాను కొంతమేర అడ్డుకున్నట్టే .