టీడీపీ మాజీమంత్రి స్వగ్రామంలో ఎక్సైజ్ దాడులు: నిషేధం ఉన్నా.. అక్కడ మాత్రం విచ్చలవిడిగా!
కడప: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీమంత్రి స్వగ్రామంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించడం కడప జిల్లాలో కలకలం పుట్టించింది. మాజీమంత్రి ఆది నారాయణ రెడ్డి స్వగ్రామం దేవగుడిలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజకీయ వేడిని రగిల్చింది. రాష్ట్రం మొత్తం నిషేధించిన బెల్ట్ షాపులు దేవగుడిలో యథేచ్ఛగా కార్యకలాపాలను కొనసాగిస్తుండటమే దీనికి కారణం.
ఏపీలో ఆ ఉద్యోగుల సేవలు రద్దు: నెలాఖరులోగా తొలిగించండి: ప్రభుత్వ నిర్ణయం వెనుక..!
జమ్మలమడుగు పట్టణంలో మూతపడ్డ కొన్ని బెల్ట్ షాపులను దేవగుడిలో తెరిచారని, నిబంధనలకు అనుగుణంగా అవి పని చేస్తున్నట్లు తేలడంతో స్పెషల్ స్క్వాడ్ అధికారులు ఈ దాడులను నిర్వహించారు. రెండురోజుల కిందట జమ్మలమడుగు టౌన్ లో అక్రమంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్న బెల్ట్ షాపులపై ప్రొద్దుటూరుకు చెందిన స్పెషల్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటికి తాళాలు వేశారు. సుమారు 500 వరకు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తోన్న ఇద్దరిని అరెస్టు చేశారు. జమ్మలమడుగు టౌన్ లో బెల్ట్ షాపులు మూతపడటంతో ఆది నారాయణ రెడ్డి స్వగ్రామాన్ని కేంద్రంగా చేసుకుని మళ్లీ వాటిని తెరిచారు. దేవగుడి గ్రామాన్ని ఆధారంగా చేసుకుని ద్విచక్ర వాహనాల ద్వారా మద్యం విక్రయాలను చేపట్టారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు బైక్ ల ద్వారా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీనితో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను నిర్వహించారు.
జిల్లాలో బలమైన రాజకీయ నాయకుడిగా ఆదినారాయణ రెడ్డికి పేరు ఉండటం, ఆయన స్వగ్రామంలో, ఆయన అనుచరులు నిర్వహిస్తోన్న బెల్ట్ షాపులపై దాడులు చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ముందే అంచనా వేశారు. ఫలితంగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. దేవగుడిపై మెరుపు దాడులు చేపట్టారు. వంద వరకు మద్యం బాటిళ్లు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ సుమారు 15 వేల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. బెల్టు షాపు నిర్వాహకుడు నాగ సంజీవరెడ్డిని అరెస్టు చేశారు. రాజకీయ ప్రాబల్యం ఉన్న మరి కొందరు విక్రయదారులు అక్రమంగా మద్యం వ్యాపారాలను నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే మరిన్ని చోట్ల దాడులను నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యాన్ని అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జమ్మలమడుగు పరిసర గ్రామాలు, రైల్వే కొండాపురం, ముద్దనూరు, మైలవరం మండలం పరిధిలోని కొన్ని తండాలు, పెద్ద ముడియం వంటి చోట్ల మద్యాన్ని ద్విచక్ర వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. మద్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిల్వ ఉంచడం వంటి చర్యలపై ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని అన్నారు.