టెన్షన్ పోల్స్ : ఏపీలో చంద్రబాబుదే అధికారం... లోక్సభలో జగన్దే పైచేయి
ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని పలు సర్వేలు చెబుతుంటే... లోక్సభ సీట్లలో మాత్రం జగన్దే పైచేయి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో వెల్లడైంది.
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో టీడీపీకే ప్రజలు పట్టం కడుతారని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటితో పాటు పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే రెండో సారి కూడా సీఎంగా చంద్రబాబు అయ్యే అవకాశాలున్నాయి. అయితే కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న బాబు ఆశలకు జగన్ పార్టీ గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూస్ 18 - ఐపీఎస్ఓఎస్ సంస్థలు చేపట్టిన సర్వేల్లో వైసీపీకి 13 లోక్సభ సీట్లు వస్తాయని టీడీపీకి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే మాత్రం టీడీపీకి 14 సీట్లు వస్తాయన అంచనా వేయగా వైసీపీకి 11 సీట్లు వస్తాయని పేర్కొంది.ఇక ఇండియా టుడే యాక్సిస్ పోల్ వైసీపీకి 18 నుంచి 20 స్థానాలు దక్కుతాయని టీడీపీకి 4 నుంచి 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంచనా వేసింది. ఇక చాణక్య -24 పోల్ టీడీపీకి అనుకూలంగా 17 లోక్సభ స్థానాలు ఇవ్వగా వైసీపీకి 8 స్థానాలు ఇచ్చింది. ఇక ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ ఫలితాలను చూస్తే రెండు సర్వేలు చంద్రబాబు నాయుడికే పట్టం కట్టాయి. అంతేకాదు చంద్రబాబు పాలనకు ప్రజలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నాయి. మరో సర్వే మాత్రం జగన్ భారీ తేడాతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని జోస్యం చెప్పాయి.
లగడపాటి ఫలితాలు టీడీపీకి..జాతీయ ఫలితాలు జగన్కు
ఇక అసెంబ్లీ ఎగ్జిట్ ఫలితాలు చూస్తే లగడపాటి రాజగోపాల్ 90 నుంచి 110 స్థానాలు టీడీపీకి చెప్పగా.. 65 నుంచి 79 స్థానాలు వైసీపీకి వస్తాయని వెల్లడించారు. ఇక ఇతరులకు 1 నుంచి 5 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. అదే ఇండియా టుడే యాక్సిస్ పోల్ టీడీపీ 37 నుంచి 40 స్థానాలకే పరిమితం కానుండగా.. వైసీపీకి 130 నుంచి 135 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.ఇక జనసేనకు 1 సీటు మాత్రమే వస్తుందని చెప్పింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే అది నిజంగానే పెద్ద వండరే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచి అన్ని సవాళ్లే ఎదురయ్యాయి. ఇక బీజేపీతో బంధం తెంచుకున్న తర్వాత మరిన్ని కష్టాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకత, కులం, అవినీతి అనే అంశాలపైనే ప్రధానంగా ఏపీలో ఓటింగ్ జరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
మోడీపై యుద్దం ప్రకటించిన చంద్రబాబు
ఇక నరేంద్ర మోడీపై యుద్దం ప్రకటించిన క్రమంలో చంద్రబాబు నాయుడు ఇతర విపక్ష పార్టీల నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు విపరీతంగా శ్రమించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు వీవీప్యాట్ల వెరిఫికేషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో 21 పార్టీలు పిటిషన్లు వేయడంలో చంద్రబాబు కీలక పాత్ర వహించారు.అయితే వారి పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయినప్పటికీ తమ పోరాటం ఆగదని ఢిల్లీ వేదికగా చెప్పారు. యూపీఏకు చంద్రబాబు స్నేహహస్తం ఇవ్వగానే టీడీపీ ప్రధాన ప్రత్యర్థి వైసీపీని బీజేపీ దువ్వడం మొదలు పెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. హంగ్ పార్లమెంటు వస్తే జగన్ మద్దతు కీలకంగా మారుతుందని భావించిన బీజేపీ అతన్ని చెడ్డ చేసుకోకుండా ఒక ఆప్షన్గా జగన్ను అట్టిపెట్టుకుంది బీజేపీ. ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సొంతంగా పోటీచేసినప్పటికీ చంద్రబాబు-జగన్ యుద్ధంలో కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాయి.
చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రచారం కోసం నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూఖ్ అబ్దుల్లాను, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను తీసుకొచ్చి అంతా ఏకతాటిపైనే ఉన్నామనే సంకేతాలు బీజేపీకి పంపారు. అంతేకాదు జగన్-తెలంగాణ సీఎం కేసీఆర్లతో కలిసి మోడీ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని తన ప్రచారంలో బలంగా వాడారు చంద్రబాబు. ఆంధ్రుల ఆత్మాభిమానంపై వీరు దెబ్బ కొట్టేలా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని లేవనెత్తారు.
చంద్రబాబు యూటర్న్లపై ప్రజల్లోకి తీసుకెళ్లిన జగన్
ఇదిలా ఉంటే జగన్ సభలకు భారీగా ప్రజలు వచ్చారు. అంతేకాదు తన తల్లి విజయమ్మ, సోదరి శర్మిల కూడా జగన్కు తమ ప్రచారంతో సహాయం చేశారు. రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నాటి రాజశేఖర్ రెడ్డి పాలనకంటే మెరుగైన పాలనను జగన్ తీసుకువస్తాడని ప్రచారంలో చెప్పారు. అంతేకాదు నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేసి ఇప్పుడు సొంతలాభం కోసం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనే విషయాన్ని జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పవన్ ప్రభావం పెద్దగా లేదనే అభిప్రాయాన్ని జాతీయ సర్వే సంస్థలు తెలిపాయి. జనసేన పార్టీ ఓట్లు చీల్చగలిగిందే తప్ప సొంతంగా సీట్లు సాధించేలా అయితే కనిపించడం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో రెండు పార్టీల నేతలు కాస్త టెన్షన్లో ఉన్నారు. ఓ వైపు లగడపాటి చెప్పిన అంచనాలు తన క్రెడిబులిటీని ప్రశ్నిస్తుండగా మరోవైపు జాతీయ సంస్థలు జగన్కు జై కొట్టాయి. ఈ టెన్షన్ తొలగాలంటే మే 23 వరకు అంటే ఫలితాలు వెలువడే వరకు వేచిచూడాల్సిందే.