మంత్రిపదవి ఊరించి..చివరకు ఉసూరుమనిపించింది..! జగన్ పక్కన పెట్టింది వీరినే..!!
అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం ప్రభుత్వమంటే కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటుంది... జగన్ ప్రభుత్వం అయితే రెడ్డి సామాజిక వర్గానిదే హవా అని సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరిగే అంశమే.. అదే విధంగా సునామీలా గెలిచి అధికారం చేపట్టబోతున్న వైసీపీ ప్రభుత్వంపైన అదే అంచనా వేశారు. మంత్రి వర్గంలోనూ రెడ్లకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారని అయితే అందుకు భిన్నంగా జగన్ అడుగులు వేశారు. రెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్న ముద్ర పడకూడదని మంత్రివర్గ కూర్పులో సామాజిక అంశాలకు పెద్ద పీఠ వేశారు. 40కి పైగా సీట్లు గెలుచుకున్న రెడ్డి వర్గానికి మంత్రి వర్గంలో కేవలం నాలుగు బెర్తులే దక్కాయి. దీంతో మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అనే ప్రచారం బాగా జరిగిన వారికి అవకాశం దక్కకుండా పోయింది.
ముందువరసలో ఉన్న ఆర్కే..! లోకేష్ మీద గెలిచిన ఆళ్ల కి నో బెర్త్..!!
అలాంటి వారిలో ప్రధానంగా అందరి నోళ్లల్లో నానిన పేర్లలో ముందు వరుసలో ఉండేది చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండో సారి గెలుపొందిన ఆర్కే. రోజా, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ ని ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఉన్నారనే చెప్పాలి. స్పీకర్ పదవి మొదలకుని మహిళా మంత్రిత్వ శాఖ వరకు అనేక పదవులు రాబోతున్నట్లు రోజా గురించి విస్తృత ప్రచారమే జరిగింది. ఆ తరువాత అదే స్థాయిలో ప్రచారం పొందిన నాయకుడు ఆళ్ల రామకృష్టారెడ్డి గురించే.. ఎందుకంటే చంద్రబాబు వారసుడిగా చెప్పుకునే లోకేష్ ఓడించడం ఒకటైతే, ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ స్వయంగా ఆళ్లని గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
నిరుత్సాహ పరిచిన జగన్..! అయోమయంలో రోజా..!!
వీరిద్దరు రెడ్డి అవడం వల్లే చివరి నిమిషంలో బెర్త్ ఖాయం కాలేదని తెలుస్తోంది. వీరితోపాటు తిరుపతి నుంచి గెలిచిన భూమన కరుణాకర్ రెడ్డి, తెలుగుదేశం నుంచి పార్టీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి, చంద్రగిరి నుంచి గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ సొంత జిల్లా రాయచోటి నుంచి గెలిచిన శ్రీకాంత్ రెడ్డికి కూడా మొండి చేయి చూపించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబుకు కూడా స్థానం దక్కలేదు. పార్టీ పెట్టింది మొదలు ప్రత్యర్థి నాయకులపై విరుచుకుపడటంలో ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. ముఖ్యంగా టీడీపీపై మాటల దాడి చేయండంలో ముందున్నారు.
అంబటి ఆశలు ఆవిరి..! అటకమీద పెట్టిన అదిష్టానం..!!
అందులోనూ జగన్ కు చాలా సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఆయనకు మంత్రి పదవి తప్పనిసరి అనుకున్నారు. ఒకవైపు కాపు సామాజికవర్గం కూడా కలిసొస్తుంది అనుకున్న వేళ ఆయనకు మంత్రిగా అవకాశం రాకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి. కర్నూలు జిల్లా నుంచి శిల్పా కుటుంబానికి కూడా మంత్రి పదవి వస్తుందని అంచనా వేశారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ వదులుకుని మరీ వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఈ తరుణంలో నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కూడా బలంగా నిలబడ్డారు కాబట్టి వారికి బెర్త్ ఖాయం అనుకున్నారు. కాని కర్నూల్ జిల్లా నుంచి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డికి తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి కాబట్టి శిల్పా కుటుంబానికి మొండిచేయి చూపించినట్లు అర్థమైంది.
గోదావరి జిల్లాల నేతల అసంతృప్తి..! ఎదురు చూపులు తప్పవేమో..!!
వీరితోపాటు గిరిజన నాయకుడు పోలవరం నియోజకవర్గం నుంచి గెలిచిన తెల్లం బాలరాజుని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. ఆయనకు గిరిజన శాఖ ఇస్తారని కూడా విస్తృత ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పాముల పుష్ప శ్రీవాణికి అవకాశం దక్కడంతో ఆయనకు నిరాశ తప్పలేదు. మర్రి రాజశేఖర్ కూడా ఆశించారు. ఆయనకు జగన్ గతంలో హామీ కూడా ఇచ్చారని సమాచారం అయినా ఈ సారి బెర్త్ దక్కలేదు. అదే విధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులకు కూడా మంత్రి బెర్త్ ఖాయం అయ్యిందని ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగా ఆయనకు జగన్ నుంచి ఫోన్ కూడా వచ్చిందంటూ అభిమానులు కూడా సంబురాలు కూడా చేసుకున్నారు. అయినా ఆశాభంగం తప్పలేదు. వీరందరినీ ఆశించిన మంత్రి పదవి ఊరించి ఉసూరుమనిపించింది.