జగన్ మరో సంచలనం: పోలవరం టెండర్లు రద్దు..!! మంత్రుల్లో...వైసీపీలో కలకలం.!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం. పోలవరం టెండర్ల రద్దు దిశగా అడుగులు. పోలవరం హెడ్ వర్క్స్ లో అవినీతి జరిగిందని..ప్రధాన గుత్తేదారుతో ఒప్పందం రద్దయితే ఇక సబ్ కాంట్రాక్టర్లకు అవకాశం ఉండదంటూ ఏపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. దీంతో అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాని కమిటీ సూచన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీని పైన ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే జరిగితే పోలవరం పనుల్లో ఏమైనా ఆటంకం ఏర్పడుతుందా..పోలవరం ఆలస్యం అయితే రాజకీయంగా నష్టపోతామా..ప్రతిష్టా త్మ ప్రాజెక్టు విషయంలో ఈ నిర్ణయం సరైనదేనా అనే చర్చలతో వైసీపీలో కలకలం మొదలైంది.
పోలవరంకు రీ టెండరింగ్..
జాతీయ ప్రాజెక్టు అయినా రాష్ట్రమే నిర్వహిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి పైన తాజా ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అనూహ్య సిఫార్సులు చేసింది. పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ అయిన ట్రాన్స్ట్రాయ్తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని సూచించింది. ప్రధాన గుత్తేదారుతో ఒప్పందం రద్దయితే ఇక ఉప గుత్తేదారులకు అవకాశం ఉండదని, అందువల్ల మొత్తం అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాల్సిందేనని సూచించినట్లు సమాచారం. ఈ కమిటీ పోలవరం ప్రాజెక్టు కు 2005లో టెండర్లు పిలిచిన నాటి నుంచి చోటుచేసుకున్న అన్ని పరిణామాలపై కమిటీ దృష్టి సారించింది. గత 5ఏళ్ల తెదేపా ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయాలను, ఉత్తర్వులను సమగ్రంగా సమీక్షించింది. పనులను రద్దు చేసి రీ టెండరింగ్కు వెళ్లాలని సూచించింది. అదే సమయంలో ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పనులు ఆగ కుండా నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేసింది.
రాయపాటి నుండి రికవరీ తప్పదా..
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులను 2013లో ట్రాన్స్ట్రాయ్ సంస్థ టెండర్లద్వారా దక్కించుకుంది. అంచనా విలువపై 14శాతం తక్కువకే పనులు చేస్తామంది. ఆ తర్వాత ట్రాన్స్ట్రాయ్ ఆధ్వర్యంలో ఎల్అండ్టీ, బావర్, త్రివేణి, కెల్లర్, బెకం వంటి సంస్థలు సబ్ కాంట్రాక్టర్లుగా పనులను విభజించుకొని కొనసాగుతున్నారు. మరోవైపు కీలకమైన స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాం తదితర పనులను ట్రాన్స్ట్రాయ్ నుంచి 60సి కింద తొలగించి నవయుగ సంస్థకు జల వనరులశాఖ అప్పగించింది. దాదాపు రూ.4000 కోట్ల విలువైన పనులను నవయుగ చేపట్టింది. ఇదే సమయంలో ట్రాన్స్ట్రాయ్ సంస్థ దివాలా తీసింది. దీంతో దాదాపు పోలవరంలోని పనుల న్నింటినీ వేరే సంస్థలకు జల వనరులశాఖ అప్పగించినా ట్రాన్స్ట్రాయ్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. ఏ మాత్రం పనులు చేపట్టకుండానే 10శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా రూ.310 కోట్లను ఎలా చెల్లించారని కమిటీ తప్పుబట్టినట్లు సమాచారం.
మంత్రులు..వైసీపీలో కలకలం..
ఏపీలో జగన ముఖ్యమంత్రి అయిన తరువాత రాజధాని పనులను తాత్కాలికంగా నిలిపి వేసారు. అధికారికంగా చెప్పక పోయినా..టెండర్ల పైన విచారణ జరుగుతోంది. దీనిని ఇప్పటికే ప్రతిపక్షం టీడీపీ ప్రచారాస్త్రంగా మలచుకుంది. ఇక, ఇదే సమయంలో పోలవరం పైనా టెండర్లను రద్దు చేసి..రీ టెండరింగ్కు వెళ్లటం ద్వారా న్యాయ పరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, రీ టెండరింగ్లో ప్రస్తుత నిర్మాణ బాధ్యతలు తీసు కున్న సంస్థలు సైతం పాల్గొన వచ్చని ప్రభుత్వం చెబుతోంది. అయితే, పోలవరం మరో మూడేళ్లు పడుతుందని పీపీఏ అధికారులు ఇప్పటికే స్పష్టం చేసారు. తాజాగా టెండర్ల రద్దు నిర్ణయం అమలు చేస్తే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీని కారణంగా రాజకీయంగా నష్ట పోవటంతో పాటుగా.. టీడీపీ చేతికి అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని కొందరి అభిప్రాయం. దీంతో..ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆగకుండా సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది ఉండదని సీనియర్ నేతల సూచనగా కనిపిస్తోంది. మరి...ఈ విషయంలో ముఖ్యమంత్రి తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారింది