రాజధాని నిర్మాణం పై నిపుణుల కమిటీ పర్యటిస్తుంది : బోత్స
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంపై అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిపుణుల కమిటీ పర్యటిస్తుందని చెప్పారు. రాజధాని నిర్మాణం ఎక్కడ జరపాలో కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఈనేపథ్యంలోనే గతంలో రాజధాని నిర్మాణంపై ఏర్పాటు చేసిన కమిటీ మంత్రి నారాయణ ఆధ్యర్యంలో పని చేయడంపై ఆనే ఎద్దెవా చేశారు.
మంత్రి నారాయణ సూచన మేరకు రాజధాని నిర్మాణం చేశారని చెప్పిన ఆయన... తాను మాత్రం నారయణను కాదని సత్యనారయణను అని అన్నారు. నిపుణుల సూచన, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణంపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై ఆయన పలు నిర్ణయాలు వెలువరించారు. ఉగాది కల్లా అర్హులైన పేదలందరికి ఇళ్లు నిర్మీస్తామని తెలిపారు. గత ప్రభుత్వం వలే లబ్ధిదారుల నుండి నయా పైసా తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా నిర్మిస్తామని చెప్పారు. కాగా ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందిని గుర్తించినట్టు మంత్రి తెలిపారు.
ఇందుకోసం పట్టణాల్లో సెంటు , గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నర సెంట్లలో ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మరోవైపు వైఎస్ హాయాంలో నిర్మించిన జీప్లస్ ఇళ్లకు మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఇక టీడ్కో ద్వార నిర్మించే ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తామని చెప్పారు. టిడ్కో పరిధిలో నిర్మించే 50వేల యూనిట్లకు రివర్స్ టెండరింగ్ చేపడుతామని అన్నారు..