బొబ్బిలిలోని ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు: మావోయిస్టుల కోసమేనా?
విజయనగరం: విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలోని ఓ ఇంట్లో భారీ పేలుడు పదార్థాలు పోలీసులను దిగ్భ్రమకు గురి చేశాయి. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు శ్రీనివాస రావు అనే వ్యక్తి ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసి, సోదాలు నిర్వహించారు.
శుక్రవారం నిర్వహించిన ఈ సోదాల్లో శ్రీనివాస రావు నివాసంలో 800 జిలిటెన్ స్టిక్స్, 5 వేల డెటోనేటర్లు లభించాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు విచారిస్తున్నారు.
మావోయిస్టులకు చేరవేయడానికే శ్రీనివాస రావు వాటిని నిల్వ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పాచిపెంటకు పంపించడానికి వాటిని నిల్వచేసినట్లు శ్రీనివాస రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. బొబ్బిలి ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు ఎక్కుగా ఉన్నారని అనుమానిస్తున్నారు.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మావోయిస్తుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పేలుడు పదార్థాలను మావోయిస్టులకు చేరవేయడానికే నిల్వ చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. స్థానికులు శ్రీనివాస రావుకు అనుమానం రాకుండా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పిందని భావిస్తున్నారు.