కలకలం: తిరుమల వెళ్లే దారిలో పేలుడు పదార్థాలు
తిరుపతి: తిరుమల వెళ్లే దారిలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. రోజువారీ కూంబింగ్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీవారి మెట్ల దగ్గరి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు.
పోలీసులు జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ పరికరాలు లభ్యమయ్యాయి. భారీగా కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుర్తు తెలియని దుండగులు ఇక్కడ ఆ పరికరాలను విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడి దుండగులు ఈ పదార్థాలను ఎందుకు తెచ్చారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాంబు తయారీకి ఉపయోగపడే పదార్థాలే కావడంతో పోలీసులు విస్తృతంగా పరిశీలన జరిపారు. ఘటనా స్థలానికి ఐజీ కాంతారావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అసాంఘిక శక్తులెవరైనా ఈ పదార్థాలను ఇక్కడికి తెచ్చారా? అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు పోలీసులు.