Tirupati Shirdi Express: పట్టాలు తప్పిన తిరుపతి-షిర్డీ ఎక్స్ ప్రెస్.. !
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు తిరుపతి-షిర్డీ మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ కు మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లాలోని రైల్వే కోడూరు స్టేషన్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. ఎక్స్ ప్రెస్ జనరల్ బోగీ పట్టాల మీది నుంచి కిందికి దిగబడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రేణిగుంట జంక్షన్ నుంచి సిబ్బందిని రప్పించారు.
నంబర్ 17417 ఎక్స్ ప్రెస్ ఈ ఉదయం 8:35 నిమిషాలకు తిరుపతి నుంచి షిర్డీకి బయలుదేరింది. సరిగ్గా గంట సేపటి తరువాత కడప జిల్లాలోని రైల్వే కోడూరు వద్ద పట్టాలు తప్పింది. రైల్వే కోడూరు స్టేషన్ లోకి ప్రవేశించడానికి లోకో పైలెట్ బ్రేక్ ను వేసిన వెంటనే పట్టాలు తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. రైల్వే కోడూరు పట్టణంలోకి ప్రవేశించిన తరువాత రైలు కొద్దిసేపు నెమ్మదిగా ప్రయాణించిందని, కాస్సేపటికే పెద్ద శబ్దంతో పట్టాలు తప్పిందని వెల్లడిస్తున్నారు.
రైలు జనరల్ బోగీ చక్రాలు.. పట్టాల మీది నుంచి నేల మీదికి దిగిపోయాయి. ఈ సందర్భంగా రైలు కుదుపులకు లోను కావడం, భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పట్టాలు తప్పిన తరువాత కొన్ని మీటర్ల పాటు రైలు ప్రయాణించడంతో పట్టాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ప్రయాణికులెవ్వరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, గాయాలు గానీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రైల్వే కోడూరు స్టేషన్ మాస్టర్ వెంటనే ఈ సమాచారాన్ని గుంతకల్ డివిజనల్ మేనేజర్ కార్యాలయానికి, రేణిగుంట జంక్షన్ సిబ్బందికి తెలియజేశారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే రేణిగుంట జంక్షన్ నుంచి సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మరమ్మతు పనులను చేపట్టారు. పట్టాలు స్వల్పంగా ధ్వంసం కావడం వల్ల ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలను సరి చేసిన అనంతరం... రైళ్ల రాకపోకలను క్రమబద్దీకరిస్తామని అధికారులు తెలిపారు.