‘‘20 లక్షలు తీసుకో.. విడాకులిచ్చేయ్’’: పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య యత్నం
కోటి కలలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టిన ఓ అమాయకురాలిని శరాఘాతాలైచుట్టుముట్టాయి అదనపు కట్న వేధింపులు.
గుంటూరు: అతడేమో డాక్టర్. ఆమేమో పీజీ వైద్య విద్యార్థిని. పైగా ప్రేమించి పెళ్ళాడాడు. మరి ఆ కాపురం ఎలా ఉంటుంది? కోటి వసంతాలు విరబూయవా?? పాపం.. ఇలాగే అనుకుని .. కోటి కలలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టిన ఓ అమాయకురాలిని శరాఘాతాలై చుట్టుముట్టాయి అదనపు కట్న వేధింపులు.
పెళ్ళైన పదో రోజు నుంచే వేధింపులు మొదలయి... గత 14 నెలలుగా సాగుతూనే ఉన్నాయి. అయినా ఆమె మౌనంగా అన్నిటినీ భరించింది. కొడుకును మందలించి కాపురం చక్కబెట్టాల్సిన అత్తమామలు కూడా అతడికే వత్తాసు పలకడం భరించలేక ఆమె చివరికి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని దేవిలక్ష్మిని డాక్టర్ సాయికృష్ణ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైన పదో రోజు నుంచే అదనపు కట్నం తీసుకురమ్మని వేధించడం మొదలుపెట్టారు.
గత 14 నెలలుగా ఈ వేధింపులు సాగుతూనే ఉన్నాయి. ''రూ.20 లక్షలు ఇస్తాం.. తీసుకుని విడాకులు ఇచ్చేయ్..'' అనేది వేధింపుల తాజా సారాంశం. డాక్టర్ సాయికృష్ణ తండ్రి సాంబశివరావు నాగార్జున యూనివర్శిటీలో రెక్టార్ గా పని చేస్తుండగా, తల్లి కృష్ణశ్రీ పొగాకు బోర్డు ఉద్యోగి.
ప్రభుత్వ విప్ దూళిపాళ్ల నరేంద్ర కూతుర్ని డాక్టర్ సాయికృష్ణకు ఇచ్చి మళ్ళీ వివాహం చేయాలని చూస్తున్నారని, అందుకే తమకు రూ.20 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకునే ప్రయత్నంలో భాగంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే తమ కుమార్తె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని దేవిలక్ష్మి తల్లి వాణి అరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరుతున్నారు.