అర్ధాంతరంగా ఆగిన లాంచీ వెలికితీత పనులు: వాతావరణం అనుకూలించక!
రాజమహేంద్రవరం: గోదావరి నదిలో మునిగిన పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠని వెలికి తీసే పనులు మూడో రోజు కూడా కొలిక్కి రాలేదు. బుధవారం కచ్చులూరు సహా తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో బాలాజీ మెరైన్స్ సంస్థ నిపుణులు పనులను అర్ధాంతరంగా ఆపేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పనులను నిలిపివేయాల్సి వచ్చిందని ధర్మాడి సత్యం వెల్లడించారు. పనులు ప్రారంభించిన రోజుతో పోల్చుకుంటే మూడో రోజు నాటికి గోదావరిలో ఉధృతి కూడా స్వల్పంగా పెరిగింది.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక లాంచీ మునిగి పోయిన ఘటన చోటు చేసుకుని 20 రోజులైంది. ఇప్పటిదాకా కొన్ని మృతదేహాలు కనిపించట్లేదు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు తమ సహాయక చర్యలను ఇదివరకే నిలిపివేశాయి. గోదావరిలో సుమారు 310 అడుగుల మేర నదీ గర్భానికి చేరుకున్న లాంచీ వెలికి తీయడానికి ఎన్డీఆర్ఎఫ్, నౌకాదళ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో లాంచీని వెలికి తీసే పనుల కాంట్రాక్టును ధర్మాడి సత్యానికి చెందిన బాలాజీ మెరైన్స్ కు అప్పగించారు.
లాంచీని బయటికి తీయడానికి మూడు రోజులుగా ధర్మాడి సత్యం, ఆయన సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. తొలి రోజు లంగరుకు బరువైన వస్తువు తగలడం దాన్ని ఇనుప తాళ్లతో కట్టి ప్రొక్లెయినర్ల సహకారంతో లాగడానికి ప్రయత్నించినప్పటికీ.. అది వ్యర్థమైంది. ఇనుప తాళ్లు తెగిపోయాయే తప్ప.. ఆ బరువైన వస్తువు బయటికి రాలేదు. అది లాంచీనే అయి ఉంటుందని అంచనా వేశారు. రెండో రోజు బోటు బయటికి తీయడం సాధ్యపడుతుందని అందరూ అనుకున్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలితాలను ఇవ్వలేదు.
మూడో రోజు సాయంత్రం కచ్చులూరు పరిసరాలతో పాటు గోదావరి నదీ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీనితో పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేదని ధర్మాడి సత్యం, ఆయన సిబ్బంది అభిప్రాయపడ్డారు. గోదాావరిలో ఉధృతి సైతం స్వల్పంగా పెరిగిందని చెప్పారు. వాతావరణం అనుకూలిస్తేనే.. నాలుగో రోజు బోటు వెలికితీత పనులను చేపడతామని అన్నారు. మూడో రోజు సాయంత్రం వరకూ లంగరు వేసి నదీ గర్భాన్ని గాలించినప్పటికీ.. బరువైన వస్తువులేవీ తగల్లేదని చెప్పారు. తాము వేసుకున్న అంచనాలకు పూర్తి భిన్నంగా ఇక్కడి పరిస్థితి ఉందని అన్నారు.