దారుణం: వివాహేతర బంధానికి ఒప్పుకోలేదని ఇంటికి నిప్పుపెట్టాడు
తనతో అక్రమ సంబంధానికి ఒప్పు కోలేదనే కోపంతో ఓ వ్యక్తి సదరు మహిళ ఇంటికి నిప్పుపెట్టాడు.
కృష్ణా: జిల్లాలోని నూజివీడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో అక్రమ సంబంధానికి ఒప్పు కోలేదనే కోపంతో ఓ వ్యక్తి సదరు మహిళ ఇంటికి నిప్పుపెట్టాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బాపూనగర్ రోడ్డులో నివాసముంటున్న ఓ మహిళ భర్తను వదిలేసింది.
ఓ ప్రభుత్వ సంస్థలో హౌస్ కీపర్గా పని చేస్తూ.. తల్లి, కూతురుతో కలిసి జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన తలారి రవి.. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కొంత కాలంగా ఆమెను వేధిస్తున్నాడు. రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండటం గమనార్హం.
కాగా, శనివారం రాత్రి బాధిత మహిళ తనకూతురుతో కలిసి గాంధీనగర్లోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన రవి.. తన కోరిక తీర్చలేదనే అక్కసుతో ఆదివారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో సదరు మహిళ ఇంటికి వెళ్లాడు. తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. ఇనుప బీరువాను ధ్వంసం చేశాడు. అందులోని రూ.20 వేల నగదు, నాలుగు కాసుల బంగారం దొంగిలించాడు. లోపలి సామానుపై పెట్రోలు పోసి నిప్పంటించి అక్కడ్నుంచి పరారయ్యాడు.
గమనించిన స్థానికులు సాయం కోసం కేకలు వేశారు. చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంట్లోని రెండు సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద నష్టమే తప్పింది. కాగా, దీనిపై రవిని అనుమానించిన చుట్టుపక్కల మహిళలు ఆదివారం అతడ్ని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.