నారా వర్సెస్ ఆళ్ల! పోరు నుంచి తప్పుకొన్న జనసేన పార్టీ
గుంటూరు: జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని అమరావతి ప్రాంతానికి ఆనుకుని ఉండటం ఒక ఎత్తయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బరిలో దిగడం మరో ఎత్తు. మంగళగిరి ఎన్నికల బరి నుంచి జనసేన పార్టీ తప్పుకోవడం కూడా నివ్వెరపరిచేలా చేస్తోంది. రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తు ఉన్న నేపథ్యంలో.. జనసేన పార్టీ ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. దీనితో- ఈ నియోజకవర్గంలో పోరు ద్విముఖమేనని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరో దఫా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.
డ్రీం క్యాబినెట్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
నారా వర్సెస్ ఆళ్ల
ఆళ్ల రామకృష్ణా రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ తరఫున మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిరంజీవులుపై 12 ఓట్ల తేడాతో ఆళ్ల గెలుపొందారు. నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉంది. సౌమ్యుడిగా పేరుంది.
ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఇప్పటికీ ఆయన వ్యవసాయం చేస్తూ, సాధారణ జీవితాన్ని గడపుతుండటం, స్థానికులకు అందుబాటులో ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. రాజన్న క్యాంటీన్ పేరుతో నాలుగు రూపాయలకే భోజనాన్ని అందజేస్తున్నారు. ఇది ఎన్నికల్లో కీలక పాత్ర పోషించగలదని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం అందకపోయినప్పటికీ.. సొంత నిధులతో కొన్ని అభివృద్ధి పనులను చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
ఆళ్ల.
న్యాయపరమైన అంశాలపై ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంచి పట్టు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నోటుకు ఓటు కేసు విషయంలో ఆళ్ల.. పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు వరకూ వెళ్లారాయన. ఈ కేసు విచారణపై చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకునే పరిస్థితిని కల్పించడంలో ఆళ్ల కీలక పాత్ర పోషించారు.
ప్రతిష్ఠాత్మకమైన, వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో ఆళ్ల న్యాయస్థానాల్లో పోరాడారు. సదావర్తి సత్రం భూముల రేటును సవరించే పరిస్థితిని తీసుకొచ్చారు. అప్పటి వరకూ 12 కోట్ల రూపాయలు మాత్రమే పలికిన సదావర్తి భూములు.. న్యాయస్థానాల జోక్యం అనంతరం 27 కోట్లకు పెరిగింది. ఇవన్నీ ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కలిసొచ్చే విషయాలుగా భావిస్తున్నారు.
నారా.. తొలిసారి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడనే పేరుతో రాజకీయ రంగప్రవేశం చేశారు లోకేష్. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తండ్రి కేబినెట్ లో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. తొలుత పెదకూరపాడు, ఆ తరువాత భీమిలీ, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గాల పేరు వినిపించినప్పటికీ.. మంగళగిరి నుంచి పోటీ ఖాయం చేసుకున్నారు.
తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పట్లాగే వైఎస్ఆర్ సీపీ-బీజేపీ-టీఆర్ఎస్-కేసీఆర్ లింకులను జత చేస్తూ ఆయన ప్రచారం సాగుతోంది. ఆయన ప్రచారంలో రాజధానిలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రస్తావన కాస్త తక్కువే. స్థానిక నాయకులు ఆయనకు అండగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు కావడంతో ఈ నియోజకవర్గంలో ఆయన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు స్థానిక పార్టీ నాయకులు. గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ ఆయన వెంటే ఉంటున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ చిరంజీవులు సైతం.. లోకేష్ వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకోవడం వెనుక
జనసేన పార్టీ మంగళగిరి బరి నుంచి తప్పుకోవడం ఓ రకంగా విశేషమే. ఎందుకంటే- నారా లోకేష్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే, అక్కడ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి, ఓడిస్తానని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి ఆయన అభ్యర్థినే నిలబెట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వామపక్షాలతో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో.. మంగళగిరి స్థానాన్ని జనసేన పార్టీ సీపీఐకి కేటాయించింది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థులు మూడుసార్లు విజయం సాధించారు. దీనితో- ఈ సీటును సీపీఐకి కేటాయించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కుమారుడే బరిలో దిగడంతో.. సీపీఐ అభ్యర్థి గట్టిపోటీ ఇవ్వగలరా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.