ఉద్రిక్తతకు దారితీసిన టీడీపీ నేత ఫేస్ బుక్ పోస్ట్...ఏం జరుగుతుందో!
గుంటూరు: ఫేస్బుక్లో టిడిపి యువ నేత పెట్టిన ఒక పోస్టు గుంటూరు జిల్లా మాచర్లలో రాజకీయ వివాదానికి కారణం మవడంతో పాటు పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మాచర్ల ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 2019 ఎన్నికల్లో సీటు రాదని, వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ సర్వేలో రామకృష్ణారెడ్డి ఓడిపోతారని తేలిందనే వివరాలతో టీడీపీ యువనేత ఒకరు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
అలాగే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని..అందువల్ల మాచర్ల నియోజకవర్గం బాధ్యతలను మరో సామాజికవర్గం నేతకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కూడా ఆ యువకుడు తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుపై ఎమ్మెల్యే పీఆర్కే వర్గీయులు స్పందించి ఆ పోస్టుకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టగా...అది చిలికి చిలికి గాలివానగా మారి చివరకు మాచర్ల పట్టణంలో ఉద్రికత్తకు కారణమైంది...ఎలాగంటే
ఈ పోస్టును మాచర్ల టీడీపీ ఇన్చార్జి చలమారెడ్డి సన్నిహితుడైన బ్రహ్మారెడ్డి పెట్టినట్లుగా ఎమ్మెల్యే వర్గీయులు గుర్తించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోస్టు పెట్టిన బ్రహ్మారెడ్డి తండ్రి వీరారెడ్డి తనను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంపుతానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన పార్టీకి చెందిన ఒక కార్యకర్త సెల్నుంచి తనకు ఫోన్చేసి ఇలాంటి పోస్టులు పెడితే చంపుతానని బెదిరించాడని వీరారెడ్డి మాచర్ల అర్బన్ సీఐ సాంబశివరావుకు ఫిర్యాదుచేశారు. దీనికి సంబంధించి తమ వద్ద వాయిస్ రికార్డు కూడా ఉన్నట్లు ఆయన సీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సిఐ ఫిర్యాదుతోపాటు వాయిస్ రికార్డు కూడా ఇవ్వమని వారికి సూచించారని సమాచారం.
మరోవైపు ఈ విషయమై స్పందించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీరారెడ్డిని తాను చంపుతానని బెదిరించినట్లు రుజువు అయితే కేసు కట్టమని సీఐతో అన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే మంగళవారం స్వయంగా పోలీస్స్టేషన్కు వచ్చి సీఐ సాంబశివరావుతో మాట్లాడారు.
రెండు దశాబ్దాలపాటు వీరారెడ్డి తన వద్ద ఉన్నాడని, ఆ తరువాత వారు పార్టీ మారారని సిఐకి వివరించారు. తనపై పోస్టు పెట్టిన బ్రహ్మారెడ్డికి ఫోన్ చేస్తే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందని ఆలోచించి తనతో ఒకప్పుడు చనువుగా ఉన్న అతడి తండ్రికి ఫోన్ చేసి ఇలాంటివి అనవసరమని మాత్రమే చెప్పానని సిఐకి వివరించినట్లు తెలిసింది.
మరోవైపు ఈ వివాదంపై సీఐ సాంబశివరావును వివరాలు అడుగగా ఎమ్మెల్యే తనను ఫోన్లో బెదిరించినట్లు వీరారెడ్డి ఫిర్యాదుచేశారని...ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా ఇలాంటి అసత్యమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలని తమను కోరారని చెప్పారు. అయితే ఈ ఫిర్యాదులపై కేసులు కట్టాలో లేదో ఉన్నతాధికారులను అడిగి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.