fact check : విజయవాడలో ఎల్లుండి నుంచి వారం రోజుల లాక్ డౌన్... వాస్తవమిదే..
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతీ రోజూ రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో రోజుకు వెయ్యి కేసులకు పైగా నమోదవుతూనే ఉన్నాయి. దీంతో జనాల్లోనూ భయాలు పెరుగుతున్నాయి. ఇదే కోవలో కీలకమైన విజయవాడ నగరంలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి ఎలాగో ఆదివారం కావడంతో అప్రకటిత లాక్ డౌన్ విధిస్తున్నారు. దీన్ని వారం రోజుల పాటు కొనసాగిస్తారనే ప్రచారం సాగుతంది. ప్రస్తుతం రోజుకు వందలాది కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్ధితులు కూడా ఉన్నాయి. దీంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.
వాస్తవానికి విజయవాడ నగరంలో ప్రస్తుతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. నగరంలో దాదాపు 21 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి. వీటిలో ఆంక్షల అమలు కొనసాగుతోంది. బ్యారికేడ్లు కూడా వేయడంతో ఏ క్షణాన్నైనా లాక్ డౌన్ విధించవచ్చన్న ప్రచారం సాగుతోంది. దీంతో జనం కూడా కూరగాయలు, ఇతర అత్యవసర సరుకులు కొనేందుకు ఎగబడుతున్నారు. దీంతో రద్దీ కూడా పెరుగుతోంది.
Recommended Video
అయితే తాజాగా విజయవాడలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారంపై కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మాట వాస్తవమేనని, అయితే లాక్ డౌన్ పై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు నిరాధరమని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార వార్తలతో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు. దీంతో విజయవాడ లాక్ డౌన్ వార్తలు నిజం కాదని తేలిపోయింది.