ఫెయిలవుతాననే భయంతో విద్యార్థిని ఆత్మహత్య.. తీరా చూస్తే ఫస్ట్ క్లాస్ లో...
పరీక్షల్లో తప్పుతానేమో అనే భయంతో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే.. ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాసైంది.
గుంటూరు: పరీక్షల్లో తప్పుతానేమో అనే భయం, ఫెయిలయితే నలుగురూ ఏమనుకుంటారో అనే ఆత్మన్యూనత.. చివరికి ఆ విద్యార్థినిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి. కానీ తీరా చూస్తే.. ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాసైంది. కానీ ఏం లాభం?
ప్రకాశం జిల్లాకు పదేళ్ల క్రితం వలసవచ్చి పుల్లడి గుంటలో స్థిరపడి, పొలాలను కౌలుకు తీసుకుని పనిచేసుకుంటున్న వెంకటేశ్వర్లు, లింగమ్మ దంపతుల కుమార్తె జి దివ్య. గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్ లో ఉంటూ ఇంటర్ చదివింది.
అయితే తాను పరీక్ష సరిగ్గా రాయలేదని, తప్పుతానన్న ఆత్మన్యూనతతో, ఫలితాలు వెలువడడానికి కొద్ది గంటల ముందు దివ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షాక్ ఏమిటంటే.. గురువారం ప్రకటించిన ఫలితాల్లో దివ్య ఫస్ట్ క్లాసులో పాస్ అవడం.
పరీక్షలు రాసొచ్చినప్పటి నుంచి దివ్య ముభావంగా ఉందని, తీవ్ర మానసిక వేదనతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. తమ బిడ్డ చనిపోవడం, ఆపై ఆమె ఉత్తీర్ణురాలైనట్టు తెలియడం.. అదీ ఫస్ట్ క్లాసులో అని తెలిసి వెంకటేశ్వర్లు, లింగమ్మ దంపతులు గుండెలవిసేలా రోధించడం అందరి హృదయాలను కలచివేసింది.