ఏపీకి ఇంతకంటే అవమానం ఉంటుందా?: తెలంగాణతో పోల్చుతూ చంద్రబాబు, విజయసాయి ఇలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇందుకు నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధత సూచి 2020నే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
ఏపీ స్థానం విచారకరం..
‘నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన "ఎగుమతుల సన్నద్దత సూచి 2020"లో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉండటం విచారకరం. అతి పొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం... కనీసం ఇతర 8 తీర ప్రాంత రాష్ట్రాలతో కూడా పోటీ పడలేక 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇంతకన్నా అవమానం ఉంటుందా?
‘పోర్టులు లేకున్నా తెలంగాణ 6వ స్థానంలో ఉంటే, 11 మైనర్ పోర్టులు, 1మేజర్ పోర్టు ఉన్నప్పటికీ ఏపి ఇలా దిగజారడం.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. "తీరప్రాంత రాష్ట్రమైనా పాలసీపరంగా ఏపీ పనితీరు నాసిరకంగా ఉందని" నీతి అయోగ్ వ్యాఖ్యానించడం కన్నా అవమానం ఏముంది?)' అని చంద్రబాబు ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు.
లోకేశం.. అమరావతి అవినీతి పుట్ట కూలిపోతుందనా?
ఇది ఇలావుంటే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘లోకేశం.. మీ లిటిగేషన్ రాజకీయాలు ఎవరికి తెలీవు? కానీ మీ శాడిజం పరాకాష్టకు చేరింది. చివరికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకు? అమరావతి అవినీతి పుట్ట కూలిపోతుందనా? ఏదేమైనా పేదల ఇళ్ల స్థలాలని అడ్డుకున్న ప్రతి పక్షంగా మీరు చరిత్రలో నిలిచిపోతారు జూమ్ బాబులు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Recommended Video
ఆంధ్ర ఔరంగజేబుగా గుర్తుంటారు..
‘బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మ్రోగింది. పాపం పండి పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే పాలిటిక్స్ నుండీ నిష్క్రమణ తప్పదని హస్తిన మాట. వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబు. కానీ ఆంద్ర ఔరంగజేబ్ గా మీరు కలకాలం గుర్తుండిపోతారు. పెద్దాయన సాక్షిగా' అంటూ దుయ్యబట్టారు. అమరావతిపై బాబుగోరు పెట్టిన వెబ్ పోలింగ్ తో మరోసారి పచ్చరంగు బయటపడింది. అది 'ఎల్లో' బ్యాచ్ పోలింగ్ అని భలే కలర్ ఫుల్ గా చెప్పారు. అయ్యో.. మళ్ళీ దొరికిపోయారా జూమ్ బాబు ? అన్నట్టు.. ఆ వెబ్ సైట్ ని క్రాష్ చేశారెందుకు? అసలు రంగు బయటపడిందనా? అని విజయసాయి రెడ్డి విమర్శించారు.