ఏపీలో పీసీబీ అధికారులమంటూ ఫోన్లు- పారిశ్రామిక వేత్తలను డబ్బుల డిమాండ్- అలర్ట్ జారీ..
ఏపీలోని పరిశ్రమల్లో తాజాగా జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటిని సొమ్ము చేసుకుంటూ కేసుల నుంచి తప్పిస్తామంటూ పారిశ్రామిక వేత్తలను కొందరు బెదిరించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించిన వ్యవహారం బయటపడింది.
పీసీబీ అధికారుల పేరుతో గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలోని కొందరు పారిశ్రామిక వేత్తలకు ఫోన్లు వెళ్లాయి. మీ పరిశ్రమల మీద ఉన్న కేసులు కొట్టేసేలా పీసీబీలో లాబీయింగ్ చేస్తామంటూ డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. అనుమానంతో సదరు పారిశ్రామిక వేత్తలు పీసీబీని సంప్రదించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. పీసీబీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ కాల్స్ 8008445437 నంబరుతో శంకర్ రెడ్డి అనే పేరుతో వచ్చినట్లు గుర్తించారు. తాను పీసీబీ అధికారినని, మీ పరిశ్రమలపై ఉన్న కేసులు కొట్టేసేలా చూస్తానని చెప్పి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. ఆ డబ్బును 7093993736 గూగుల్ పే నంబరుకు పంపాలని సూచించాడు. ఆరా తీసిన పోలీసులు మొదటి నంబరు చిత్తూరు జిల్లా కల్లూరు గ్రామంలో ఉన్నట్లు, గూగుల్ పే నంబరు ఖాతా వివరాలు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు.
పీసీబీతో పాటు పారిశ్రామిక వేత్తల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ప్రకటించారు. ఇలాంటి మోసాల పట్ల రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు అప్రమత్తంగా ఉండాలని పీసీబీ కోరుతోంది. పీసీబీ అధికారుల పేరుతో ఎవరు ఫోన్ చేసినా తమ దృష్టికి తీసుకురావాలని, డబ్బులు ఇవ్వొద్దని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎలాంటి సందేహాలున్నా 7993477763 నంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని పీసీబీ సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సూచించారు.