ఉద్యోగాల పేరిట డబ్బులు గుంజి.. విద్యార్థినులను ముంచిన సాఫ్ట్వేర్ కంపెనీ..!
విజయవాడ : ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్న మోసగాళ్లు పెరిగిపోతూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక చోట మోసగాళ్ల లీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఉద్యోగాల ఆశ జూపి అందినకాడికి దండుకుంటూ బోర్డు తిప్పేస్తున్న కంపెనీలు కొకొల్లలు. అదే కోవలో తాజాగా క్యాంపస్ ఇంటర్వ్యూల పేరిట విద్యార్థులను నట్టేల ముంచింది ఓ సాఫ్ట్వేర్ కంపెనీ. చదువు అయిపోగానే ప్లేస్మెంట్ దొరుకుతుందని భావించిన విద్యార్థినులు సదరు కంపెనీ ప్రతినిధులు అడిగినంత ముట్టజెప్పారు. తీరా ఆ సంస్థ బోర్డు తిప్పేసిందని తెలిసి ఆందోళనకు గురవుతున్నారు.
మూడేండ్ల కిందట లంచం.. ఇంతవరకు పనిగాలే.. వీఆర్వోపై తిరగబడ్డ రైతు..! (వీడియో)
ఇలా మోసం చేస్తున్నాయి.. అలా బోర్డు తిప్పేస్తున్నాయి..!
నమ్మకమే పెట్టుబడిగా వంచిస్తున్న కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసే కంపెనీలు రోజుకో చోట బయటపడుతూనే ఉన్నాయి. అవకాశాల పేరిట ఉద్యోగార్థులను మోసం చేస్తూనే ఉన్నారు మాయగాళ్లు. డిగ్రీలు చేతబట్టుకుని జీవన పోరాటం కోసం ఆరాటపడుతున్న నిరుద్యోగుల నుంచి ఉల్టా డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తున్న ఫ్రాడ్ కంపెనీల మోసాల అన్నీ ఇన్నీ కావు.
ఇక క్యాంపస్ ఇంటర్వ్యూల పేరిట కూడా మోసాలు జరుగుతుండటం గమనార్హం. అప్పుడే చదువు పూర్తయి కొత్తగా ఉద్యోగంలో చేరబోయేవారికి ఎన్నో ఆశలుంటాయి. అయితే వాటిని ఆదిలోనే తుంచేస్తున్నాయి కొన్ని కంపెనీలు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సైతం అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. ఉద్యోగాలు ఇస్తామని ఆశలు కల్పిస్తూ చివరకు వారిని మోసం చేస్తున్నాయి.
విజయవాడలో మోసం.. విద్యార్థులను ముంచిన ఫ్రాడ్ కంపెనీ..!
ఉద్యోగాల పేరిట ఇంజనీరింగ్ విద్యార్థినులను మోసం చేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని మూడవ నెంబర్ రోడ్డులో ఉన్న ప్రో సాఫ్ట్ సొల్యూషన్ కంపెనీ.. క్యాంపస్ ఇంటర్వ్యూల పేరిట విద్యార్థినులను నిండా ముంచింది. ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర 5వేల రూపాయలు వసూలు చేసుకుని తీరా బోర్డు తిప్పేసింది. విద్యార్థినులను నమ్మించిన సదరు కంపెనీ నిర్వాహకుడు సాయి ధరణిధర్ డబ్బులు దండుకుని మాయమయ్యాడు.
సదరు సంస్థ ప్రతినిధులు మార్చి నెల చివరలో తిరువూరులోని శ్రీవాణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. తమ కంపెనీలో ఉద్యోగవకాశాలు ఉన్నాయంటూ నమ్మించి అందులో కొందరిని ఎంపిక చేసుకున్నారు. అలా ఎంపికైనవారు జూన్ 1వ తేదీన ఉద్యోగాల్లో జాయిన్ కావాలని కాల్ లెటర్లు కూడా పంపించారు. అలా ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డ ఆ విద్యార్థినుల సంతోషం ఎంతోకాలం నిలవలేదు. జూన్ 1న ఉద్యోగాల్లోకి తీసుకుని 15 రోజులు పనిచేయించుకున్నారు. ఆ తర్వాత సంస్థను మూసివేస్తున్నామని ప్రకటించారు.
ఉద్యోగం కోసం 5వేలు గుంజారు..!
సదరు సంస్థ ఉద్యోగాలకు ఎంపికచేసిన విద్యార్థినులంతా దాదాపు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. దాంతో వారు విజయవాడలోని హాస్టళ్లలో ఉంటూ ఆ సంస్థ కార్యాలయంలో పనిచేశారు. కనీసం కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేయకుండా తమ ఫోన్ల ద్వారానే వారి ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చేయించుకున్నారని విద్యార్థినులు వాపోయారు. నెల తర్వాత జీతం డబ్బులు అడిగితే లేవంటున్నారని.. ఆ క్రమంలో కనీసం తామిచ్చిన 5వేల రూపాయలు తిరిగి ఇవ్వమంటే కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో సంస్థ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
మోడీ తీరు మారిందా.. బీజేపీ నేతలకు ఇక దబిడి దిబిడేనా?
బీ అలర్ట్.. చిన్న లాజిక్ మిస్సవ్వకండి..!
ఉద్యోగాలు కల్పించడమంటే ఆయా కంపెనీలే అభ్యర్థులకు జీతాలు ఇవ్వాలి. కానీ, కొన్ని కంపెనీలు మాత్రం అభ్యర్థుల నుంచి డబ్బులు గుంజుతుండటం ఆలోచించాల్సిన విషయం. పనిచేయించుకుని నెలనెలా జీతాలు ఇవ్వాల్సిన కంపెనీలు తమ నుంచి డబ్బులు ఎదురు తీసుకోవడమేంటని ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకుంటే ఇలాంటి కంపెనీలకు చెక్ పెట్టొచ్చు. కానీ అలా ఎవరూ చేయడం లేదు. ఫ్రాడ్ కంపెనీలు అడిగినంత ఇస్తూ ఉద్యోగాల కోసం ఆ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. సదరు కంపెనీల ప్రతినిధులు రెండు మూడు నెలలు తిప్పుకున్న తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే వారు స్కెచ్ వేసిన మొత్తం వారికి సమకూరి ఉంటుంది. ఈ చిన్న లాజిక్ మిస్సవ్వకుండా యువత అలాంటి కంపెనీల వలకు చిక్కుకోకపోవడం బెటర్.