ఎపిలో నకిలీ నోట్ల కలకలం:కోట్ల సంపాదన పేరుతో అమాయకులకు గాలం
అమరావతి:మీ దగ్గర కేవలం కొన్ని వేల రూపాయల డబ్బుంటే చాలు..వాటితోనే కోట్లు సంపాదించవచ్చంటూ రాష్ట్రంలో నకిలీ నోట్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. మీ దగ్గర ఉన్నరూ.2 వేలు ఇచ్చి 8 వేలు తీసుకోండి...ఇలా కోట్లు సంపాదించేయండి అంటూ అమాయకులపై ఫేక్ కరెన్సీ ముఠాలు వల విసురుతున్నాయి.
తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని ఆశపడి అచ్చం ఒరిజినల్ కరెన్సీ నోట్లలాగే ఉన్నఈ నకిలీ నోట్లను తీసుకున్న జనాలు...ఆ తరువాత పోలీసులకు దొరికిపోయి డబ్బుల లెక్కల సంగతేమో కాని కటకటాలు లెక్కబెడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువైపోవడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో ఇలా దొంగ నోట్లు చలామణి కేసుల్లో అరెస్టైన వారి కదలికలు, వారి కాల్ డేటా పై నిఘా పెట్టడంతో పాటు నయా మోసగాళ్ల గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవలే విశాఖలో...రెండు ఘటనలు...
దొంగ నోట్లకు సంబంధించి విశాఖలో ఇటీవలే రెండు ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యి ఈ ఫేక్ కరెన్సీ వ్యవహారాలపై దృష్టి సారించారు. హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తోన్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.10.20 లక్షల విలువైన నకిలీ నోట్లను డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (విశాఖ రీజనల్ యూనిట్) అధికారులు పట్టుకున్నారు. వీరు ఈ నకిలీ నోట్లను బంగ్లాదేశ్ ప్రాంతంలోని ఫరకా పట్టణం నుంచి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన వాళ్లిద్దరూ కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన వారుగా విచారణలో తేలింది.
మరో ఘటనలో...మహిళ దొరికింది...
త్వరలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో వీటిని ఖర్చు చేసేందుకు తీసుకొస్తున్నట్లు ఈ నిందితులు పోలీసు అధికారుల ఎదుట ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఇద్దరూ పాత నేరస్తులని...గతంలో బెంగళూరులో వీరిద్దరూ ఒక కిడ్నాప్ కేసులో అరెస్టయినట్లు పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు భోగట్టా. అలాగే వీరికి స్మగ్లింగ్ కార్యకలాపాలతో కూడా సంబంధాలున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఇక విశాఖ జిల్లాలోనే...చీడికాడ మండలం కోణం వారాంతపు సంతలో దొంగ నోట్లను మారుస్తున్న మహిళను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ మహిళ వద్ద రూ. 3 లక్షల రెండు వేల నగదు రూ. 500 జిరాక్స్ నోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్...నుంచేనని!
ఈ నకిలీ కరెన్సీని ఒక కుట్ర ప్రకారం గతంలో పాకిస్థాన్...ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా మనదేశానికి భారీగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కమీషన్లను ఎరగా వేసి కింది స్థాయిలో అమాయకులను ఆకర్షించి...తద్వారా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్రతో ఇదంతా చేస్తున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ కుట్రలో అమాయకులైన సామాన్యులు చిక్కుకొని అల్లాడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఇటుంవంటి ఘటనలే వరుసగా తిరుపతి, అనంతపురం, రాజమండ్రిలో చోటు చేసుకోగా తాజాగా విశాఖలో లక్షలాది రూపాయల ఫేక్ కరెన్సీ పట్టుబడింది.
పోలీసులు అప్రమప్తం...హెచ్చరిక
అయితే విశాఖపట్నంలో దొరికిపోయిన నిందితులు ఈ దొంగనోట్ల చలామణికి సంబంధించి అత్యంత కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది.ఆ సమాచారం ఆధారంగానే తిరుపతి, అనంతపురం పోలీసులను పోలీస్ కేంద్ర కార్యాలయం అప్రమత్తం చేసినట్లు తెలిసింది.అలాగే కర్ణాటక ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పశ్చిమ బెంగాల్ లోని మాల్దా నుంచి తీసుకొచ్చిన ఫేక్ కరెన్సీ తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో దాచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్ఐఏ సైతం రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులను అప్రమత్తం చేసింది. అలాగే కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎఫ్సీఓఆర్డీ బృందం కూడా ఈ వ్యవహారంపై పరిశోధన ప్రారంబించినట్లు తెలిసింది.