కరోనా వార్డులో నకిలీ డాక్టర్ కలకలం: 4రోజులపాటు విధులు, మహిళ, ఆమె భర్త అరెస్ట్
విజయవాడ: ఆమె పేరు శైలజ. డాక్టర్ శైలజగా అందరినీ పరిచయం చేసుకుంది. అంతేగాక, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్ ధరించి కరోనా బాధితులున్న వార్డులకు, ఐసీయూలకు వెళుతూ పర్యవేక్షించారు. దీంతో అందరూ ఆమెను వైద్యురాలిగా నమ్మేశారు. అయితే, నాలుగు రోజుల తర్వాత గానీ, ఆమె డాక్టర్ కాదనే విషయం తెలియలేదు. కొత్తగా 80 మంది వైద్యులు రావడంతో అందులో ఈమె కూడా ఒకరని తాము మొదట భావించినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.
కరోనా వార్డులు, ఐసీయూల్ హల్చల్..
బుధవారం కూడా మెడలో స్టెతస్కోప్ వేసుకుని ప్రభుత్వ ఆస్పత్రి సూపర్ స్పెషాలటీ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్కు వచ్చింది ఈ నకిలీ డాక్టర్ శైలజ. అక్కడ స్టోర్ కు వెళ్లి డాక్టర్ శైలజ అని రిజిస్టర్ లో రాసి పీపీఈ కిట్ కూడా తీసుకుంది. అనంతరం అక్కడే అటు ఇటు తిరుగుతుండగా అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది.. మీరు ఎవరని ప్రశ్నించారు. అయితే, తాను డాక్టర్ శైలజ అంటూ సమాధానం చెప్పింది. కోవిడ్ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు తెలిపింది.
అనుమానం వచ్చి అడిగితే... పొంతనలేని సమాధానాలు..
ఈ క్రమంోల ఆమెను ఐడెంటింటీ కార్డు ఏదని ప్రశ్నించగా.. తన వద్ద లేదని ఒకసారి చెప్పింది. తమ బంధువులు వస్తానంట వచ్చానని మరోసారి, తాను ఆయుర్వేద వైద్యురాలినంటూ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో ఆస్పత్రికి చేరుకున్న మాచవరం పోలీసులు.. ఆ నకిలీ వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video
నకిలీ డాక్టర్, ఆమె భర్త అరెస్ట్... కరోనా ఉందా?
తాను పోస్టు గ్రాడ్యుయేషన్ చదివినట్లు పోలీసుల విచారణలో శైలజ తెలిపింది. అయితే, డాక్టర్ అవతారం ఎందుకు ఎత్తారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, కరోనా వార్డుల్లో తిరిగిన ఈ నకిలీ వైద్యురాలికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు కూడా ఆమెను విచారించేందుకు భయపడుతున్నారు. కాగా, ఆమెతోపాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై గతంలో కూడా కేసులున్నట్లు సమాచారం.