నకిలీ పత్రాల సృష్టికర్త అరెస్ట్: చదివింది లండన్ లో...చేసేది ఛీటింగ్
కృష్ణా జిల్లా: అతడు లండన్లో ఎంఏ లిటరేచర్ చదివాడు. ఆ తర్వాత సొంతంగా పాఠశాల నిర్వహించాడు. అయినా అనుకున్నట్లుగా డబ్బు సంపాదించ లేకపోవడంతో ఇక అడ్డదారిలో సొమ్ములు వెనకేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
ఆ క్రమంలో నకిలీ పత్రాలు సృష్టించి ఇతరుల ఆస్తులను వేరొకరికి విక్రయించడంలో ఆరి తేరాడు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ దస్తావేజుల కేసులో ప్రధాన నిందితుడు శీలం కోటిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇది. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన శీలం కోటిరెడ్డి, కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్లకు చెందిన కపిలవాయి కృష్ణవేణి, కంచికచర్ల మండలం గండేపల్లికి చెందిన దస్తావేజు లేఖరి కల్లూరి ముత్యాల వెంకటరెడ్డిలను శనివారం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రధాన నిందితుడి గురించి తెలిసి పోలీసులే ఆశ్యర్యపోయారు.వివరాల్లోకి వెళితే...
నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు కంచికచర్ల పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ కేసులో కీలక నిందితుడు శీలం కోటిరెడ్డి లండన్లో ఎంఏ లిటరేచర్ చదివాడు. ఉద్యోగం రాకపోవడంతో గంపలగూడెం మండలం ఊటుకూరులో కొంతకాలం సొంతంగా నలంద పాఠశాల నిర్వహించి నష్టపోయాడు. నష్టాలను పూడ్చుకునేందుకు మధిరకు చెందిన మాజీ వీఆర్వో గద్దల ప్రసాద్తో కలిసి నకిలీ పత్రాలను తయారు చేయడం ప్రారంభించాడు. పూర్వార్జితం పేరుతో పలు డాక్యుమెంట్లు సృష్టించాడు.
ఆ తర్వాత 2015లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజు కోవడంతో ఒక ముఠాగా ఏర్పడి ఆధార్ కార్డులతో పాటు పలు లింక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. వాటిని తనఖా పెట్టి అప్పులు తీసుకోవడం చేసేవాడు. భూముల అమ్మకం లేదా తనఖా సమయంలో వాటికి సంబంధించిన పత్రాలను ముఠా సభ్యులే సృష్టించి తీసుకొచ్చేవారు. అలా వీరి బృందంలో ఒకరైన గద్దల ప్రసాద్పై ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీసు స్టేషన్లో గతంలో నమోదైన రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి.
ఆ తరువాత కోటిరెడ్డి, కపిలవాయి కృష్ణవేణి, మరికొందరు కలిసి సుమారు రూ.1.15 కోట్ల మేర ఇలా నకిలీ దస్తావేజులతో జనాలను మోసం చేశారు. వీరికి దస్తావేజు లేఖరి ముత్యాల వెంకటరెడ్డి, మరికొందరు డాక్యుమెంట్ రైటర్లు, సాక్షులు వారికి సహకరించారు. ఈ కేసులో 12 నుంచి 15 మంది వరకు అరెస్టు చేయాలని పోలీసులు తెలిపారు. వీరు ఇలాగే పెనమలూరుకు చెందిన కంచర్ల శ్రీనివాసరావును రూ.26 లక్షలకు మోసగించడంతో, ఈనెల 20న బాధితుడు కంచికచర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు.
దీంతో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేయగా నకిలీ పత్రాలు, ఆధార్ కార్డులు, ఫోర్జరీ సంతకాలు, ఫోటోలు పెట్టి మోసం చేస్తున్నారని విచారణ తేలినట్లు చెప్పారు. నందిగామ డీఎస్పీ రాధేష్ మురళి నందిగామ గ్రామీణ సీఐ కార్యాలయంలో సీజ్ చేసిన ఒప్పంద పత్రాన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కేసులో గతంలో ఎన్నడూ లేని కొత్త కోణాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 23, 24 తేదీల్లో నిందితులపై మరికొన్ని కేసులు నమోదైనట్లు తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి భూములు అమ్మిన కేసులో నిందితులను నందిగామ కోర్టులో హాజరుపరచగా, వారికి న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు.