చంద్రబాబు పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా .. అసభ్య రాతలు .. కేసునమోదు
Recommended Video
ఏపీలో సోషల్ మీడియా కు కంట్రోల్ లేకుండా పోతుంది. గత ఎన్నికల్లో విపరీతంగా సోషల్ మీడియా ప్రభావం కనిపించింది. చాలా మంది రాజకీయ నాయకులు తాము చెప్పదలుచుకున్న విషయాలు చెప్పేందుకు సోషల్ మీడియానే ప్లాట్ ఫాం గా చేసుకున్నారు. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సోషల్ మీడియా రాజకీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ రాజకీయాలలో వేడి పుట్టిస్తుంది.
సీఎం నారా చంద్రబాబునాయుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా.. అసభ్య రాతలు, మార్ఫింగ్ ఫోటోలు
అదలా ఉంటే ఇటీవల తన పేరుతో నకిలీ ఖాతా తెరిచి అసభ్య పోస్టులు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఏకంగా చంద్రబాబు పేరు మీదే నకిలీ ఖాతా తరిచి మార్ఫింగ్ ఫోటోలతో , అసభ్య పోస్ట్ లతో రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్ళు . ఇక ఏకంగా ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించి, అసభ్యకర రాతలు, మార్ఫింగ్ ఫొటోలు పెడుతున్న వైనంపై తెలుగు తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు.. పోలీసులకు ఫిర్యాదు
ఇక ఇదంతా ఎక్కడా అంటే 'సీబీఎన్ ఆర్మీ కృష్ణా జిల్లా' పేరిట ఇటీవల ఫేస్ బుక్ లో ఓ ఖాతా ప్రారంభమైంది. దీనిలో చంద్రబాబుకు సీఎం జగన్ వైసీపీ కండువాను కప్పుతున్నట్టు ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అంతే కాదు చంద్రబాబు చిత్రానికి పసుపు, కుంకుమ రాసినట్టు ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టారు. దీన్ని చూసిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఫేక్ ఫేస్ బుక్ ఖాతాపై విచారించి, నిందితులను శిక్షించాలని కృష్ణాజిల్లా ఇన్ చార్జి పెందుర్తి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కావాలనే చంద్రబాబును కించపరిచే యత్నం .. సోషల్ మీడియాలో దుష్ప్రచారం వైసీపీ పనే అంటున్న టీడీపీ
కావాలని చంద్రబాబును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. కొందరైతే ఇదంతా అధికార పార్టీ నాయకుల పనే అని మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తుంది వైసీపీనే అని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో సోషల్ మీడియా లో ఈ తరహా ప్రచారానికి, నకిలీ ఖాతాలకు చెక్ పెట్టకుంటే భవిష్యత్ లో సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా పరిణమించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా సోషల్ మీడియా పై నిఘా ఉంచాలని, నకిలీ ఖాతాలు, అసభ్య రాతలు, అసత్య ప్రచారాలకు చెక్ పెట్టేలా సోషల్ మీడియాపై నియంత్రం అవసరం అన్న భావన ప్రజల్లో సైతం ఉంది.