ఫేక్ ఇండస్ట్రియలిస్ట్ నర్రా బాగోతం: 'నారా'వారినీ వాడుకున్నాడు..కోట్లు కాజేసిన ఘనుడు
నకిలీ పారిశ్రామికవేత్తగా కృష్ణారావు చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
విజయవాడ: నర్రా కృష్ణారావు.. ఓ నకిలీ పారిశ్రామికవేత్త. పేపర్ మీదే కంపెనీల్ని చూపించి కోట్లాది రూపాయలను కాజేసిన ఘనుడు. తన మోసాలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష పేర్లను కూడా వాడేసుకున్నాడు.
బంధువులు, స్నేహితులు అన్న తేడా లేకుండా పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరిని మోసం చేయడానికీ ప్రయత్నించాడు. పెట్టుబడుల పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎంతోమందికి కుచ్చుటోపీ పెట్టిన నర్రా బాగోతాన్ని ఎట్టకేలకు పోలీసులు బయటపెట్టారు.
ఎవరీ నర్రా కృష్ణారావు:
కృష్ణాజిల్లా నందిగామ వాసి నర్రా కృష్ణారావు. అతని భార్య పేరు ఇంద్రాణి. కృష్ణారావు వ్యాపారవేత్తగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఇదే క్రమంలో కృష్ణాజిల్లా కోలవెన్ను గ్రామంలో మ్యాక్రోకాస్ట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నష్టాలతో మూతపడిందని తెలుసుకున్నాడు. ఎలాగైనా ఆ సంస్థ చైర్మన్ కు దగ్గరై.. పెట్టుబడులు తీసుకొస్తానని నమ్మించాలనుకున్నాడు.
Recommended Video
ప్రభుత్వ పెద్దలు తెలుసునని:
తన బంధువుల సహాయంతో ఎట్టకేలకు కృష్ణారావు ఆ కంపెనీ చైర్మన్ ఎం.నారాయణను కలిశాడు. తనకు ప్రభుత్వ పెద్దలతో పరిచయం ఉందని, కంపెనీని తిరిగి లాభాల పట్టించే బాధ్యత తనది అని నమ్మించాడు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.కోటి దాకా తీసుకొస్తానని నమ్మబలికాడు. అయితే కంపెనీలో తనకు డైరెక్టర్ పదవి ఇస్తేనే ఆ పనికి పూనుకుంటానని షరతు పెట్టాడు.
డైరెక్టర్ పదవులు ఆశచూపి:
నారాయణతో మాట్లాడిన తర్వాత పెట్టుబడులు తీసుకొస్తానని హైదరాబాద్ వచ్చిన కృష్ణారావు.. పలువురి వద్దకు వెళ్లి కంపెనీలో డైరెక్టర్ పదవుల ఆశ చూపించాడు. ఇందుకు గాను కంపెనీలో పెట్టుబడులు పెట్టాలన్నాడు. మరికొందరికి ఉద్యోగాల పేరుతో నకిలీ నియామక పత్రాలను ఇచ్చాడు.
నారాయణ ఫిర్యాదుతో:
కృష్ణారావు వ్యవహారంపై అనుమానం వచ్చిన నారాయణ విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కృష్ణారావుతోపాటు భార్య ఇంద్రాణి, మరదలు శ్రీలలితను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించారు.
అంతా తప్పుడు సమాచారమే:
కృష్ణారావు పాస్పోర్టు, కంపెనీల జాబితాలు అన్నింటిలోనూ తప్పుడు సమాచారమే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుట్టింది నందిగామలో అయితే.. హైదరాబాద్లో జన్మించినట్టు ధ్రువీకరణ పత్రాలు అందజేసి పాస్పోర్టు పొందాడు. గతంలోను కృష్ణారావుపై హైదరాబాద్ సీసీఎస్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జీడిమెట్ల పరిధిలో కేసులు నమోదైనట్లు గుర్తించారు. అతని మోసాల్లో భార్య కూడా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది.
'నారా'వారి పేర్లూ వాడుకున్నాడు:
ఆఖరికి సీఎం చంద్రబాబు, లోకేష్ లను కూడా కృష్ణారావు విడిచిపెట్టలేదు. ఈ ఏడాది జనవరిలో అమరావతి హెల్త్ సిటీ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రాజధాని ప్రాంతంలో ఒక రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇదొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అని, ఇందులో నారా లోకేశ్కు 25శాతం వాటా ఉందని పలువురిని నమ్మించాడు.
అంతేకాదు, హెరిటేజ్ లోను తనకు పెట్టుబడులు ఉన్నాయని కొంతమందిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అమెరికాలో ఉంటున్న ఇంద్రాణి దత్త పుత్రిక మంజీర, ఆమె భర్త పవన్ కుమార్ కూడా.. గూగుల్ కంపెనీలో ఉద్యోగాల పేరుతో గతంలో మోసాలకు పాల్పడినట్లు తేలడం గమనార్హం.