Fake news: ‘అమరావతిలో పవన్ కళ్యాణ్ ఆమరణ దీక్ష’: క్లారిటీ ఇచ్చిన జనసేన
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహర దీక్ష చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంపై ఆ పార్టీ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమేనని, అలాంటి వార్తలను నమ్మవద్దని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
ఇసుక పోరు: రెండువారాల తర్వాత అమరావతిలో పవన్ ఆమరణ దీక్ష..వైరల్ అవుతున్న పోస్ట్
ఏదో కుట్ర..
జనసేన పార్టీ పేరుతో తప్పుడు ప్రకటనలు ప్రకటనలను వైరల్ చేస్తున్నారని.. దీని వెనుక ఏదో కుట్ర ఉందని జనసేన పేర్కొంది. ఆ ప్రకటనకు జనసేన పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అది నకిలీ ప్రెస్ నోట్ అని, అది జనసేన పార్టీ రిలీజ్ చేసింది కాదని పేర్కొంది.
ఆమరణ దీక్షంటూ..
‘మరో రెండు వారాల్లో అమరావతిలోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష' అనే శీర్షికతో జనసేన పార్టీ పేరు మీద ఈ నకిలీ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ‘భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిన్న విశాఖలో చేసిన లాంగ్ మార్చ్ సందర్బంగా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని తెలుపుకుంటు ప్రభుత్వం రాబోయే రెండు వారాల్లో కార్మికులకు రక్షణ మరియు చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు..' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ నకిలీ ప్రకటనలో ఇంకా ఏముందంటే..
అంతేగాక, ‘నవంబర్ 17న అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు జిల్లా అమరావతి నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నవంబర్ 16వ తేదీ మంగళగిరి పార్టీ ఆఫీసులో అధ్యక్షులవారు అందుబాటులో ఉండటం జరుగుతుంది. నవంబర్ 17న జరిగే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో ఆమరణ నిరాహార దీక్షలు చేయాలని ఈ సందర్భంగా తెలియచేస్తూఉన్నాం.. అందుబాటులో ఉన్న నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఆమరణ నిరాహార దీక్షకు మీ వంతు సహకారం ఉండాలని ఆకాంక్షించారు' అని ఆ నకిలీ లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లు తెలిపారు.