నకిలీ భూ రిజిస్ట్రేషన్: మళ్లీ తెరపైకి మొద్దు శీను కుటుంబం
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన మొద్దు శీను పేరు మరోసారి ఏపీలో తాజాగా వినిపించింది. ఓ భూమి రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో మొద్దు శ్రీను కుటుంబ సభ్యుల ప్రస్తావన వచ్చింది.
పరిటాల హత్యకు మొద్దు శీనుకు కోటి: భాను కిరణ్
వివరాల్లోకి వెళితే... మంగళగిరిలో రూ. 50 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఓ ఎమ్మార్పీఎస్ నేత యత్నించారు. మొద్దు శ్రీను కుటుంబ సభ్యుల పేరిట ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు అతడు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ నకిలీ డాక్యుమెంట్లను గుర్తించడంతో కంగుతిన్నారు.
దీంతో వెంటనే స్థల యజమాని వాకా రాంగోపాల్ గౌడ్ విషయాన్ని తెలియజేశారు. దీంతో వాకా రాంగోపాల్ గౌడ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు జిల్లాకు చెందిన మొద్దు శీను పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కేసు కొనసాగుతున్న సమయంలోనే మొద్దు శీనును జైలులో తోటి ఖైదీ బండరాయితో మోది హత్య చేశాడు.
మొద్ద శీను అసలు పేరు జూలకంటి శ్రీనివాస రెడ్డి. పరిటాల హత్యకు పాల్పడ్డ మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు అని కోర్టు తీర్పు చెప్పింది. మొద్దు శీను చనిపోయినందున ఆ శిక్షను అమలు చేయలేక పోతున్నట్టు కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో డిగ్రీ చదివే సమయంలోనే మొద్దు శీను రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ వచ్చాడు.
మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు: అనంత కోర్టు
దాంతో నేరప్రపంచంలోకి ప్రవేశించాడు. అతను హైదరాబాదులో ఓ హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో పరారీలో ఉన్నప్పుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనుచరుడిగా మారాడు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి ఓ విప్లవ సంస్థలో పనిచేసి మాఫియా ప్రపంచంలోకి ప్రవేశించాడు. వెంకటరెడ్డి అనే మాజీ మావోయిస్టును పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో కలిసి మొద్దు శీను హత్య చేశాడు.
ఆ తర్వాత మొద్దు శీనుకు జైలులో మద్దెలచెర్వు సూరితో పరిచయం ఏర్పడింది. సూరితో కలిసి పరిటాల రవి హత్యకు కుట్ర చేసి హతమార్చాడు. ఈ కేసులో పరారీలో ఉండగా, అనూహ్యంగా ఓ లాడ్జీలో బాంబు పేలుడులో గాయపడి ఆస్పత్రిలో చేరి పోలీసు చేతికి చిక్కాడు. అనంతపురం జైలులో అతన్ని 2008 నవంబర్ 9వ తేదీన తోటీ ఖైదీ ఓం ప్రకాశ్ హత్య చేశాడు.