టీవీ9 ముసుగులో వసూల్ రాజా.. అనంతలో నకిలీ రిపోర్ట్ అరెస్ట్
అనంతపురం : బ్రాండ్ అని ముద్రపడ్డ ప్రతీదానికి ఓ నకిలీ తయారవడం.. సదరు బ్రాండ్ ఇమేజ్ ను ఉపయోగించుకుని వ్యక్తిగతంగా లబ్ది పొందడం ఈరోజుల్లో చాలామంది బ్రతకనేర్చినోళ్లు చేస్తోన్న పని. అచ్చు ఇలాగే టీవీ9 తో సహా పలు న్యూస్ ఛానెళ్ల పేరు చెప్పుకుని అందినకాడికి దోచుకుంటున్న ఓ నకిలీ రిపోర్టర్ బాగోతాన్ని బట్టబయలు చేశారు అనంతపురం పోలీసులు.
కర్నూలు జిల్లాకు చెందిన డాలు సుబ్బారాయుడు అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం అనంతపురం వచ్చి స్థిరపడ్డాడు. కర్నూలుకే చెందిన ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న సుబ్బారాయుడు..గతంలో డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అయితే కర్నూలు నుంచి అనంతపురానికి మకాం మార్చగానే రిపోర్టర్ అవతారమెత్తాడు.
పలు ప్రముఖ ఛానెళ్ల పేర్లు చెప్పి.. స్థానికంగా ఉండే వైద్యులు, మెడికల్ స్టోర్ వ్యాపారులు, పాఠశాలలు, రేషన్ షాపు డీలర్ల నుంచి నుంచి డబ్బులు వసూలు చేయడం లేదా ఏదైనా వస్తువులు తీసుకెళ్లిపోవడం.. సుబ్బారాయుడు రిపోర్టర్ అవతారంలో చేసిన ఘనకార్యాలు. అలా.. టీవీ9 పేరు చెప్పుకుని తపోవనంలోని ఓ ఆర్ఎంపీ లేడీ డాక్టర్ నుంచి రూ.7 వేలు వసూలు చేశాడు. గుల్జార్ పేటలోని శరవణా అనే మెడికల్ స్టోర్ వ్యాపారి వద్ద నుంచి ఓ మొబైల్ ఫోన్ తీసుకున్నాడు.
తాజాగా చిన్మయనగర్ లో రఫీ అనే ప్రైవేట్ వైద్యుడి నుంచి రూ.25 వేలు డిమాండ్ చేసిన సుబ్బారాయుడు.. చివరకు రూ.4,700 వసూలు చేశాడు. అయితే సుబ్బారాయుడు చేస్తున్న ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారమంతా పోలీసులు ద్రుష్టికి రావడంతో.. అతడి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
చిన్మయనగర్ లో స్థానిక పీఎంపీ వైద్యుడి నుంచి సుబ్బారాయుడు డబ్బులు వసూలు చేశాడన్న విషయం స్థానిక ఎస్ఐ ధరణి ద్రుష్టికి రాగానే.. సుబ్బారాయుడిని అరెస్టు చేశారు. ఇదే విషయంపై సదరు పీఎంపీ వైద్యుడిని ప్రశ్నించగా.. డబ్బులు వసూలు చేసిన మాట నిజమేనని చెప్పాడు. విచారణలో భాగంగా పలువురి బాధితులను విచారించగా.. సుబ్బారాయుడి వసూళ్ల చిట్టా మొత్తం బయటపడినట్లు తెలుస్తోంది. పీఎంపీ వైద్యుడి ఫిర్యాదు మేరకు సెక్షన్ 420, సెక్షన్ 384 కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.