వీడు మామూలోడు కాదు:ఒకే వాహనంతో కోట్లు కొల్లకొట్టేశాడు...ఎలాగంటే?
గుంటూరు:మోసం చేయడంలో ఒక్కో మోసగాడిది ఒక్కో స్టైల్...ఎవరికీ రాని ఐడియాలన్నీ కొందరు కేడీగాళ్లకు వస్తుంటాయి. కాబట్టే వాళ్లు అడ్డదారిలో భారీగా అక్రమార్జన చేసేస్తున్నారు. అయితే దొంగ దొరకనంత వరకే దొర అనే నానుడి ఉండనే ఉందిగా...అలా ఈ నేరగాళ్లు ఎప్పుడోకప్పుడు పట్టుబడిపోతూనే ఉంటారు.
ఇలా ఇదే కోవలో అడ్డదారిలో కోట్లు కొల్లగొట్టిన ఓ మాయగాడి బండారం ఎట్టకేలకు బైటపడింది. అప్పటివరకు దొరలా మెయింటైన్ చేసిన ఈ అయ్యవారు ఒక దొంగ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ కేటుగాడు ఒకే వాహనం అడ్డుపెట్టి కోట్లు కొల్లగొట్టిన వైనం పోలీసులను సైతం విస్తుపోయేలా చేసిందంటే ఇతగాడి టాలెంట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు...ఇంతకీ ఈ మాయగాడు మోసానికి పాల్పడిన విధానం ఏమిటంటే?...
ఈ మాయలోడి...స్టైలే వేరు
మెడలో భారీ గోల్డ్ చైన్, చేతికి బ్రాస్ లెట్, అన్ని వేళ్లకు ఉంగరాలు...వంటిమీద ఖరీదైన ఖద్దరు డ్రెస్...అంతేనా వాడిన వాహనం వాడడు...ఒక్కోసారి ఒక్కోరకం భారీ వెహికల్ లో దర్శనమిస్తుంటాడు...ఇతడి బిల్డప్ చూస్తే ఏ పిల్లజమిందారో అనుకుంటారు. కాబట్టే అదే బిల్డప్ చూసి మనుషులే కాదు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సైతం ఘోరంగా మోసపోయాయి...ఇంతకీ అతగాడెవరంటే?...పేరు...నైనాల చంద్రశేఖర్...ప్రకాశం జిల్లా చీమకుర్తి...కేటుగాడిగా మారకముందు వృత్తి...గ్రానైట్ కంపెనీల వద్ద లారీ డ్రైవర్..నేరగాడిగా మారేందుకు తొలిఅడుగు..లారీలో గ్రానైట్ లోటుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు,దొంగ బండ్లు కొని, అమ్మే అక్కడి ముఠాలతో పరిచయం.
మొదట్లో అలానే...కోట్ల సంపాదన
తనకు పరిచయం అయిన వాహనాల దొంగల సాయంతో తొలినాళ్లలో జేసీబీలను కాజేసి అమ్మడం చేసేవాడు. వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి, వాటిని ఆర్టీఏ కార్యాలయంలో అందజేసి సుమారు రూ.లక్ష వరకు రోడ్డు ట్యాక్స్ చెల్లించి స్థానిక రిజిస్ట్రేషన్ పొందేవాడు. ఆ తరువాత ఆ వాహనం అమ్మేసేవాడు. ఆ తర్వాతర్వాత ఆ మోసాన్ని కార్లు, జీపులకు కూడా విస్తరించాడు. ఇలా చూస్తుండగానే కోట్ల రూపాయల సొమ్ము వెనుకేసుకొన్నాడు. ఏడాది తిరిగేటప్పటికి ఒక గ్రానైట్ కంపెనీనే కొనేసే స్థాయికి చంద్రశేఖర్ ఎదిగిపోయాడు. 2015లో తన భార్య అపర్ణ పేరిట చీమకుర్తిలో ఒక కంపెనీ ఏర్పాటుచేశాడు. ఒంగోలులో రూ.రెండు కోట్లు పెట్టి సకల హంగులతో ఒక ఇల్లు కూడా కట్టాడు.
ఆ తరువాత...ఆ తరువాత...మరో రకం నేరాలకు
ఆ తరువాత దొంగ బండ్ల విక్రయం మానేసి చంద్రశేఖర్ మరో కొత్త రకం మోసానికి తెరతీశాడు. దాని ప్రకారం అతడు ముందుగా షోరూమ్ కు వెళ్లి ఓ ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తాడు. ఆ తరువాత ఆ వాహనంపై ఏదో ఒక ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకుంటాడు. అయితే దొంగ పత్రాల సృష్టి అనుభవంతో దానిపై అప్పు తీర్చకుండానే, అంతా డబ్బు కట్టేసినట్టు ఓ నకిలీ ఎన్వోసీ సృష్టిస్తాడు. ఆ పత్రాలు ఆర్టీఏ కార్యాలయంలో చూపించి, దానికి క్లియరెన్స్ పొందుతాడు. తిరిగి అవే పత్రాలతో మరో ఫైనాన్స్ సంస్థను సంప్రదించి, అక్కడ నుంచి మరోసారి రుణం పొందుతాడు. ఇలా అదే తంతు...మళ్లీ మళ్లీ జరుగుతుంది. ఇటు చంద్రశేఖర్ కు కోట్ల రూపాయల డబ్బు వచ్చిపడుతుంది.
మోసం...ఇలా బైటపడింది...
ఇదే క్రమంలో చంద్రశేఖర్ ఇటీవల గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి రూ.30 లక్షలకు రెండు లేటెస్ట్ ఇన్నోవా వాహనాలను విక్రయించాడు. అమ్మేటప్పుడు ఈ వాహనాలకు రిజిష్ట్రేషన్ తో సహా అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయని చెప్పాడు. అయితే ఎన్నిరోజులయినా ‘క్లియరెన్స్' డాక్యుమెంట్లు ఇవ్వకపోతుండటంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. దీంతో నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అనుకోకుండా ఇతగాడు చేస్తున్న మోసం బయటపడింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి మరో విషయం కూడా బైటపెట్టి లబోదిబోమన్నాడు. అదేమిటంటే?...ఇదే గుంటూరు బాధితుడి దగ్గర ఓ కొత్త పార్చునర్ ఉంటే...దానిని రూ. 20 లక్షలకు అమ్మిపెడతానని చంద్రశేఖర్ తీసుకొన్నాడు. ఆ బండిని అనంతపురం వ్యక్తికి అమ్మేసి సొమ్ము కూడా తీసుకొన్నాడు. కానీ, ఆ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
ఒకే వాహనంపై...కనీసం నాలుగు ఫైనాన్స్ లు
అయితే ఆ అనంతపురం వ్యక్తికి తాను విక్రయించిన ఫార్చునర్ కు క్లియరెన్స్ ఇప్పించేందుకు ఆర్టీఏలోని తన మనుషులతో చంద్రశేఖర్ ప్రయత్నించాడు. తన సీసీల విషయం గురించి ఆరా తీసేందుకు వెళ్లిన బాధితుడికి ఆ విషయం తెలిసింది. దీంతో ఇక ఈ కేటుగాడి వ్యవహారం భారీ స్థాయిదని గుర్తించి అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి విచారణలో చంద్రశేఖర్ ఇలా విజయవాడ, దర్శి, ఒంగోలు, నెల్లూరు, ఇతర జిల్లాల్లోనూ ఫైనాన్స్ సంస్థలను, వాహన యజమానులను భారీ మొత్తాలకు దారుణంగా మోసం చేసినట్లు, ఇలా ఒక్కో వాహనంపై కనీసం నాలుగు ఫైనాన్స్ రుణాలు తీసుకొన్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆర్టీఏ సిబ్బంది సహకారం!...దొంగబంగారం దందా కూడా
అయితే ఈ విషయంలో చంద్రశేఖర్కు ఖచ్చితంగా ఆర్టీఏలోని కిందిస్థాయి సిబ్బంది సహకారం అందుతున్నట్లు, లేదంటే ఒకే వ్యక్తి అవే పత్రాలతో పదేపదే ఆర్టీఏ క్లియరెన్స్ (సీసీ) పొందటం సాధ్యం కాదని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దొంగ బంగారం దందాతోనూ చంద్రశేఖర్కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బయట రాష్ట్రాల్లో నకిలీ పేర్లతో బంగారం కొనుగోలు చేసి, ఆ బంగారాన్ని మంగళగిరికి చెందిన జనార్ధన్కు చేరవేస్తాడు. అతడు దానిని కరిగించి విక్రయిస్తుంటాడు. ఈ వ్యవహారంలో చంద్రశేఖర్కు ఆయన మామతోపాటు విజయవాడకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్, న్యాయవాది సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.