టీటీడీ, ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం: 18 మందిపై కేసు నమోదు
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు నగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన 18 మంది పై టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. జనసేన పార్టీ, పండుబుద్దాల ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్ర పూరిత పోస్ట్లు పోస్ట్ చేయడం, షేర్ చేయడం చేశారు. మరో 16 మంది ఈ దుష్ప్రచారాన్ని తమ ట్విట్టర్ ఖాతాల నుంచి పోస్ట్, షేర్ చేశారు.
'తిరుమల తిరుపతి దేవస్థానాని(టీటీడీ)కి చెందిన 1500 కిలోల బంగారాన్ని ఎస్బిఐలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం. మమ్మల్ని తరువాత కాపాడండి. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. స్వామీ ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద' అని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు హిందూ మతానికి చెందిన భక్తుల మనోభావాలను గాయపరిచి విద్వేషాలు రగిల్చే ఆలోచనతో వీరు ఈ దుష్ప్రచారం చేశారని విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో గురువారం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చట్టప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నకిలీ టికెట్ల టికెట్ల కలకలం
శ్రీవారి దర్శనం టికెట్ల దళారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. అయితే టీటీడీలో కొందరు అవినీతి ఉద్యోగులే ఈ నకిలీ టికెట్ల దందాకు సాయం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. శ్రీవారి నకిలీ దర్శనం టిక్కెట్లకు స్కానింగ్ ఉద్యోగి సహకారం అందిస్తున్నారని.. మూడు రోజులకు ఒకసారి నకిలీ టికెట్లతో వచ్చే భక్తులకు స్కానింగ్ లేకుండా దర్శనం కల్పిస్తున్నట్లు విజిలెన్స్ టీమ్స్ గుర్తించాయి. మరోవైపు.. శ్రీవారి దర్శనం నకిలీ టికెట్ల రాకెట్లో మహారాష్ట్ర వాసుల హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారానికి మహారాష్ట్రకు చెందిన పాటిల్ ప్రధాన సూత్రధారిగా అధికారులు గుర్తించారు. శ్రీవారి దర్శనం చేయిస్తామని కల్యాణోత్సవం టిక్కెట్లను మార్ఫింగ్ చేస్తున్న ముఠా వాటిని.. శ్రీవారి దర్శనం టికెట్లు లేకుండా తిరుపతికి వచ్చే వారికి అంటగడుతున్నట్లు తెలుస్తోంది.
నకిలీ సిఫార్స్ లేఖలు, మార్ఫింగ్ చేసిన దర్శనం టికెట్లతో తిరుమల శ్రీవారి భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. కరోనావైరస్ కారణంగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తుండటంతో.. ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు నకిలీ టికెట్ల తయారీ అక్రమార్కులు. తిరుపతిలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. అలిపిరి బస్టాండ్ ఈ మోసగాళ్లకు అడ్డాగా మారింది. శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ భక్తులకు సులువుగా మోసం చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది భక్తులు ఇంకా దళారీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో దళారీలు వారిని దోచేస్తున్నారు. మూడు వందల రూపాయల టికెట్ను నాలుగు వేల నాలుగు వందల రూపాయిలకు విక్రయించాడు ఓ దళారీ. తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపడంతో.. విజిలెన్స్ అధికారులు నిఘా పెంచారు. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లిన భక్తులకు మార్ఫింగ్ చేసిన టికెట్లు దళారీ విక్రయించాడు.
ఆరు వందల రూపాయల విలువ చేసే రెండు టికెట్లును ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందలకు అంటగట్టాడు. అయితే రోజూ మూడు వందల రూపాయల దర్శనానికి కేటాయించే కోటా టికెట్ల కంటే.. ఎక్కువ మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడంతో టీటీడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో.. నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుల వద్ద నకిలీ టికెట్లను గుర్తించడంతో మార్ఫింగ్ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.