బాబుXకేసీఆర్: ఏపీ, టీ కాక ఏ రాష్ట్రానికి చెందిన వారు?
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఫీజు రీయింబర్సుమెంట్స్ గొడవ ముదురుతోంది. బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో.. 1956కు ముందు తండ్రి స్థానికత ఆధారంగా రీయింబర్సుమెంట్స్ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇరు ప్రభుత్వాలు రాజకీయ పోరాటంలో సీమాంధ్రకు చెందిన వేలాది మంది విద్యార్థుల జీవితాలు అంధకారం అయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.
సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స ఇచ్చేది లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా, ఇక్కడ ఏళ్లుగా జీవిస్తున్న వారు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి స్థానికులుగా కాకుండా ఏ రాష్ట్రానికి అవుతారని టీడీపీ ఏపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తద్వారా ఏపీ కూడా ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోందంటున్నారు. మరోవైపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమను కాదంటే తాము ఏ రాష్ట్ర పౌరులుగా ఉండాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1956 నవంబర్ 1 తర్వాత రాష్ట్ర రాజధానికి చేరిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగం, వ్యాపారం పేరిట హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఇక్కడకు వచ్చి స్థిరపడ్డ వారు మొదటి తరానికి చెందిన వారు కాగా, వారిపిల్లలు రెండోతరానికి చెందిన వారవుతున్నారు. రెండోతరం వారి పిల్లలు ఇప్పుడు పాఠశాలస్థాయి, ఇంటర్మీడియట్ స్థాయిలో, ఉన్నత విద్యాసంస్థలలో చదువుకుంటున్నారు.
వీరు తెలంగాణలో జన్మించినప్పటికీ స్థానికులుగా పరిగణింపబడటం లేదు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారే కాకుండా లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్, తెలంగాణాలోని ఇతర జిల్లాల్లోనో వీరంతా విచిత్రమైన పరిస్థితిలో జీవనం గడపాల్సి వస్తోంది. వీరి పిల్లల పరిస్థితి మరింత అయోమయంగా మారింది. సీమాంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వారి పిల్లలు ఇప్పుడు 25-30 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నారు. వీరి పరిస్థితి దయనీయంగా మారింది.
1956 తర్వాత హైదరాబాద్ వచ్చిన వారి పిల్లలకు ఫీజు తాము చెల్లించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా స్థానికతను నిర్ణయించి, విద్యార్థులకు ఫీజు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంటోంది. ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు వరుసగా ఏ ప్రాంతంలో విద్యార్థి చదివితే అతను అదే ప్రాంతానికి స్థానికుడు అవుతాడన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన.
మరోవైపు, సింగపూర్ లాంటి రాజధాని కట్టుకునే వారు విద్యార్థులకు అయ్యే ఫీజులు చెల్లించుకోవచ్చు కదా అని తెలంగాణ రాష్ట్రం చెబుతోంది. అయితే, ఏపీ మదిలో మరో ఆలోచన ఉందని తెలిస్తోంది. తెలంగాణలోని ఏపీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు 150 నుండి 155 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. వీటిని చెల్లిస్తే తెలంగాణ ప్రభుత్వం ఇతర అంశాల్లో మరిన్ని మెలికలు పెట్టే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.