మాటలకందని విషాదం: లాంచీ ప్రమాదంలో మృతదేహం లభించకపోయినా.. కుమార్తెకు కర్మకాండలు!
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గోదావరి నదిలో పర్యాటక బోటు రాయల్ వశిష్ఠ ప్రమాదానికి గురై 11 రోజుల తరువాత కూడా కొందరి ఆచూకీ తెలియరాలేదు. వారందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ వాళ్లు జీవించి ఉండటానికి అవకాశాలు లేవని నిర్ధారణకు వచ్చారు బాధితుల కుటుంబీకులు. మృతదేహం లభించనప్పటికీ.. వారి ఆత్మశాంతి కోసం కర్మకాండలను పూర్తి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతై, ఇప్పటివరకూ ఆచూకీ కనిపించకుండా పోయిన రమ్యశ్రీ కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం కర్మకాండలను నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు వద్ద సంప్రదాయబద్ధంగా దశ దిన కర్మను చేపట్టారు. కర్మకాండలను పూర్తి చేశారు.
ప్రాణాలతో వస్తుందనే ఆశ లేదు..
తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ ట్రాన్స్ కో అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. పాపికొండల విహారానికి వెళ్లిన ఆమె కచ్చులూరు వద్ద చోటు చేసుకున్న లాంచీ ప్రమాదంలో గల్లంతయ్యారు. ఆమె మృతదేహం ఇప్పటికీ లభించలేదు. ప్రాణాలతో ఉండే అవకాశం ఇక ఎంత మాత్రమూ లేదని, చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామనే విషాదంలో ఉన్నారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పటి నుంచీ వారంతా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహం కోసం ఎదురు చూశారు. మృతదేహం లభింస్తుందనే ఆశలు వారిలో సన్నగిల్లాయి. ఇక తమ కుమార్తె రాదనే విషాదాన్ని భరిస్తూ, ఆమె ఆత్మశాంతి కోసం కర్మకాండలను జరిపించినట్లు రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ తెలిపారు. తమ కుమార్తె కోటిలింగాల రేవు నుంచే పాపికొండల కోసం ప్రయాణమైందని, అందుకే అదే ప్రాంతంలో తాము కర్మకాండలను నిర్వహించామని అన్నారు.
ఉద్యోగంలో చేరిన తొలి నెలలోనే..
రమ్యశ్రీ ట్రాన్స్ కోలో అసిస్టెంట్ ఇంజినీర్ గా చేరిన తొలి నెలలోనే ప్రమాదానికి గురి కావడం ఆమె కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. తొలి నెల వేతనాన్ని అందుకున్న ఆమె.. అందులో నుంచి కొంత మొత్తాన్ని భద్రాచలం ఆలయానికి సమర్పించారు. అనంతరం తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరానికి వెళ్లారని సుదర్శన్ చెప్పారు. పాపికొండల పర్యటనకు వెళ్తున్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిందని, ఇక అదే చివరి ఫోన్ కాల్ అయిందని అన్నారు.
లాంచీలో చిక్కుకుపోయి ఉండొచ్చని
ఇప్పటిదాకా ఆచూకీ తెలియని మృతదేహాలు లాంచీలో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు. లాంచీని వెలికి తీస్తే తప్ప.. తమ కుమార్తె సహా మిగిలిన వారి మృతదేహాలు జాడ దొరక్కపోవచ్చని సుదర్శన్ అన్నారు. అప్పుడైనా తమ కుమార్తె మృతదేహం లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నామని ఆయన కన్నీరు మున్నీరుగా విలపించారు.