టీడీపీకి దివ్యవాణీ గుడ్ బై..!! ఆ పార్టీ వైపే అడుగులు : రోజాకు ధీటుగా టీడీపీలో ఎవరు..!!
టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు చెబు తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ..వైసీపీ మీద ప్రధానంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు పార్టీని వీడుతున్నారు. అందులో ఎన్నికల సమయంలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతలు యామినీ ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. తాజాగా మాజీ సినీ నటి.. టీడీపీ నేత దివ్యవాణి సైతం పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించి..కొద్ది కాలం క్రితం బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు దివ్యవాణీని బీజేపీలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందుకు దివ్యవాణీ సైతం అంగీకరించారని సమాచారం. త్వరలోనే దివ్య వాణి బీజేపీ తీర్దం పుచ్చుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో బీజేపీ మీద..మోదీ మద దివ్యవాణి అనేక ఆరోపణలు..విమర్శలు ఇక, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా మాట్లాడగలిగిన మహిళా నేతలు ఇప్పుడు టీడీపీలో ఎవరూ కనిపించటం లేదు.
బీజేపీ బాటలో యామినీ..దివ్యవాణీ
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ..బీజేపీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడిని ఇద్దరు టీడీపీ మహిళా నేతలు యామినీ..దివ్యవాణీ ఇప్పుడు పార్టీ వీడటం ఖాయంగా కనిపిస్తోంది. యామినీ ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నాతో సమావేశమయ్యారు. ఎన్నికలు పూర్తయిన సమయం నుండి యామినీ బీజేపీలో చేరుతారనే ప్రచారం ఉంది. అయితే, తాజాగా కన్నా తో సమావేశం తరువాత బీజేపీ లో చేరటం ఖాయమైంది. ఎన్నికల ఫతితాల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశం నిర్వహించాల్సిందేనంటూ ఎన్నికల సంఘాన్ని నిలదీసారు. ఆ సమయంలో చంద్రబాబు వైఖరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా తప్పు బట్టారు. దీనికి ప్రతిగా యామినీ తన ట్విట్టర్ ద్వారా కన్నా పైన తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఇక, టీవీ ఛానెళ్లలోనూ అటు వైసీపీ..ఇటు జనసేన నేతలతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో చర్చలు చేసారు. అయితే, ఎన్నికల్లో టీడీపీ ఓడిన తరువాత పార్టీలో జరుగుతున్న పరిణామాలతో యామినీ తనకు ఆహ్వానం వచ్చిన సమయంలోనే బీజేపీలోకి వెళ్లాలని భావించారు. దీంతో..కన్నాతో సమావేశమై బీజేపీలో చేరుతున్నాననే సంకేతాలు ఇచ్చారు. ఇక, ఇప్పుడు అదే బాటలో మరో టీడీపీ మౌత్ పీస్ గా వ్యవహరించిన దివ్య వాణీ సైతం పయణిస్తున్నారు. దివ్య వాణీ టీడీపీ వీడటం ఖాయమని చెబుతున్నారు. త్వరలోనే బీజేపీలో చేరుతారని సమాచారం.
ఎన్నికల తరువాత పార్టీకి దూరంగా..
ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత కొద్ది రోజులు పార్టీలో పని చేసిన దివ్య వాణీ క్రమేనా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల రోజునే పార్టీ అదినేత చంద్రబాబుతో దివ్యవాణీ సమావేశమయ్యారు. ఫలితాలు ఎలా ఉన్నా మన పని మనం చేసుకుపోదామంటూ చంద్రబాబు తనతో వ్యాఖ్యానించారంటూ దివ్య వాణీ తరువాత చెప్పుకొచ్చారు. ఇక, పార్టీ ఓటమి గురించి అధినేత చంద్రబాబు సమీక్ష ఏర్పాటు చేసారు. ఆ సమయంలోనూ దివ్యవాణీ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. గుంటూరు జిల్లాలో కోడెల కుటుంబం ఉన్న వ్యతిరేకత..వారు చేసిన దందాల ప్రభావం జిల్లా మొత్తం పడిందని అందరి సమక్షంలోనే దివ్య వాణీ పార్టీ అధినేతకు నివేదించారు. ఆ తరువాత ఒకటి రెండు సమావేశాలు మినహా దివ్య వాణీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన లేదు. ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష సమయంలో ప్రధాని మోదీ..బీజేపీ..వైసీపీ నేతల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక, ఏపీలోని వైసీపీ నేతల మీద అనేక సార్లు ఫైర్ అయ్యారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ మహిళగా చెప్పిన వారు ఉన్నారు. అయితే, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతోనే టీడీపీ వీడాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
రోజాకు పోటీగా ఎవరున్నారు..
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కు ధీటుగా ఇప్పుడు టీడీపీలో ఎవరున్నారనే చర్చ మొదలైంది. రోజా టీడీపీలో ఉన్న సమయంలో నాడు వైయస్సార్ మీద రాజకీయంగా అనేక విమర్శలు చేసారు. అదే సమయంలో 2009 ఎన్నికల్లో మెగా బ్రదర్స్ మీద ఫైర్ అయ్యారు. ఇక, వైసీపీలో చేరిన తరువాత ఆ పార్టీ ఎమ్మెల్యేగా చంద్రబాబు..లోకేశ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటంలో పార్టీలో తొలి స్థానంలో నిలిచారు. అదే సమయంలో టీడీపీ హయాంలో అసెంబ్లీలో రోజాను ఎదుర్కోవటానికి పీతల సుజాత.. వంగలపూడి అనిత ను టీడీపీ అస్త్రాలుగా ఉపయోగించేంది. వారిద్దరూ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక, వాణీ విశ్వనాద్ .. యామినీ.. దివ్య వాణీలు పోటీగా ఉంటారని టీడీపీ భావించింది. అయితే వారు రోజా మీద ఆ స్థాయిలో ఆరోపణలు చేయలేదు. ఇక, ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా నేతలు సైతం టీడీపీని వీడుతుండటంతో ఇక, వైసీపీ ఫైర్ బ్రాండ్ కు ధీటుగా టీడీపీలో బలమైన వాయిస్ ఉన్న మహిళా నేతలు కనిపించటం లేదు. ఇప్పుడు ఇదే రకమైన ఆసక్తి కర చర్చ టీడీపీ శ్రేణుల్లో కొనసాగుతోంది.