ఏపీలో తెరుచుకోనున్న ప్రముఖ ఆలయాలు..!టీటీడి పై కొనసాగుతున్న ఉత్కంఠ..!
అమరావతి/హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న తరుణంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు ఆద్యాత్మికతను సంతరించుకోబోతున్నాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు, కాణిపాకం వరసిద్ది వినాయకుడి ఆలయంలో కూడా వేద మంత్రాలు వినపడనున్నాయి. ఆలయంలో దర్శనాల కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో భక్తులు వేచి ఉండేందుకు వలయాకారాలను ఏర్పాటు చేశారు.
లాక్డౌన్ నుంచి మినహాయింపు రాగానే, భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు ధర్మల్ గన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అందరూ మాస్క్ లు ధరించి రావాలని, శానిటైజర్లతో ప్రత్యేక స్టాండ్లు కూడా ఉంటాయని చెప్పారు. ఆలయంలోకి వచ్చే భక్తులను ముందుగా డిజిన్ఫెక్షన్ టన్నెల్ లోకి పంపిస్తామని తెలిపారు.
రాహుకేతు పూజలకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఒక పూజా టికెట్ కు ఒక పీట, ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. అంతే కాకుండా అటు కాణిపాకం మహాగణపతి ఆలయంలోనూ అధికారులు భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు వేచి ఉండడానికి కనీసం వ్యక్తికి వ్యక్తికి మధ్య ఒక మీటర్ దూరం ఉండేలా రింగులు గీసి ఉంచారు. ఆలయంలోకి వచ్చే భక్తులు ముఖాలకు మాస్క్ పెట్టుకోవడం, చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, క్యూలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, అలాగే పూజలు, ప్రసాదాలు, అన్నదానం ఇతరత్రా అంశాలపై విధి విధానాలను తయారు చేస్తున్నారు.
ప్రతి రోజూ పరిమిత సంఖ్యలో దర్శనాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సోషల్ డిస్టాన్స్ గుర్తుంచుకునేలా, ప్రత్యేక బాక్సులపై పెయింటింగ్ వేసి అక్కడక్కడా ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు అధికారులు. ఐతే ఈనెల 17 తర్వాత లాక్డౌన్ పొడింగింపు నిర్ణయంపై దర్శనాల అనుమతులు ఉంటాయని తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవాలయం తెరుచుకనే అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.