'గోపాల గోపాల' అపశృతులు: పవన్ ఫ్యాన్ గొంతు కోసిన దుండగులు
న్యూఢిల్లీ: 'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ వద్ద అపశృతులు చోటు చేసుకున్నాయి. కొందరు దుండగులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని గొంతు కోసి పారిపోయారు. శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లాకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని కన్నా శ్రీనివాస్ వచ్చారు. శ్రీనివాస్ శిల్పకళావేదిక గేటు నెంబర్ 1 వద్ద రాగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతని గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ఇదిలా వుంటే, మరో అపశ్రుతి కూడా చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కారు ఢీకొని బౌన్సర్ కాలు విరిగింది. శిల్ప కళావేదికలో ఆదివారం గోపాల గోపాల ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు వెంకటేష్ కూడా వచ్చారు. ఈ సినిమాలో వారిద్దరు నటించడం విశేషం.
ఈ సినిమాలో పవన్ కోసం ఓ బైక్ను అమెరికా నుంచి దిగుమతి చేశారు. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మిగతా ముఖ్య పాత్రల్లో మిధున్చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షాపంత్, నర్రా శీను తదితరులు నటించారు.