ఫ్యాన్ స్వీచ్ మోదీ, రెగ్యులేటర్ కేసీఆర్ : లోకేశ్ విసుర్లు
విజయనగరం : వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోకేశ్. జగన్ చేతిలో ఉట్టి ఫ్యాన్ ఉందని .. మోదీ చేతిలో స్వీచ్ ఉందన్నారు. పవర్ మోదీ అయితే జగన్ కేవలం పావు అని విమర్శించారు. ఇక ఫ్యాన్ స్పీడ్ పెంచాలంటే రెగ్యులేటర్ కంపల్సరీ అని .. అది కూడా జగన్ వద్ద లేదన్నారు. కేసీఆర్ రెగ్యులేటర్ ను తిప్పితే తప్ప ఫ్యాన్ తిరగని పరిస్థితి అని విమర్శించారు. విజయనగరం జిల్లా తెర్లాంలో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగించారు.
1000 కార్లు, ప్రచార రథాలు ..
ఇటీవల ఏపీకి వెయ్యి కార్లు వచ్చాయి. ప్రచార రథాలు కూడా తీసుకొచ్చారు. ప్రచార రథానికి వైసీపీ బొమ్మ ఉంది కానీ ఆ కారు సీటు కవర్ మార్చలేదని విమర్శించారు లోకేశ్. సీటు కవర్ గులాబీ రంగు ఉందని, కారు అంబాసిడర్ కారు అని తెలిపారు. అలాగే వెయ్యి కోట్ల నగదును ఏపీకి తరలించారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో భూములన్న టీడీపీ నేతలను కేటీఆర్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు లోకేశ్.
పోలవరం పూర్తి కావొద్దు, ముంపు మండలాలపై కన్ను
పోలవరం ప్రాజెక్టు పూర్తి కానీయొద్దని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు లోకేశ్, అలాగే ముంపు మండలాలను తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. అలాగే మచిలీపట్నం పోర్టులో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలని కుట్ర పన్నిందని, దీనిని ప్రధానికి రాసిన లేఖ నిదర్శనమన్నారు. మిగులు బడ్జెట్ ఉండే హైదరాబాద్ తీసుకున్నారు .. ఇప్పడు పోర్టు కన్నుపడిందని, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని స్పష్టంచేశారు.
మారిన స్వరం .. పెరిగిన పరిణితి
లోకేశ్ ప్రసంగం సూటిగా స్పష్టంగా సుత్తిలేకుడా జరిగింది. ఇంతకుముందటిలా తడబాటుకు గురికాలేదు. ఇటీవల మచిలీపట్నం పోర్టును తరలించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించగా .. తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా మాట్లాడారు. అలాగే కేటీఆర్ తో జగన్ రహస్య ఒప్పంద వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. జగన్ పేరు .. కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేశ్.