చిరు అందరివాడు.. రాజకీయాల్లో కొందరివాడే..! మళ్లీ పొలికల్ ఎంట్రీ వద్దంటున్న ఫాన్స్..!!
అమరావతి/హైదరాబాద్ : మెగాస్టార్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల పట్ల ఆయన అభిమానులు స్పందించారు.అన్నయ్య అందరివాడుగా ఉండాలంటే సినిమాల్లో ఉండాలని, కొందరి వాడిగా మిగిలిపోవాలనుకుంటే రాజకీయాల్లోకి రావాలని చిరంజీవి అభిమానులు అభిప్రాయపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పోయినచోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న కథనాలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి.
అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి పొలిటికల్ రీ-ఎంట్రీ ఇస్తే జనసేన పార్టీకి నష్టం జరిగే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి బీజేపీలో చేరుతారన్న కథనాల పట్ల మెగా ఫ్యాన్స్ సుముఖంగా లేరని సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందరూ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా జనసేనలో మొన్నటి ఎన్నికల సమయంలో చురుకైన పాత్ర పోషించారు.
చిరంజీవి త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో చిరంజీవికి ఏపీ బీజేపీ సారథ్య పగ్గాలు అప్పగిస్తారని కూడా రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చిరంజీవి బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తామంటూ పలువురు బీజేపీ నేతలు కామెంట్స్ చేశారు. అయితే ఈ కథనాలపై చిరంజీవి వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. చిరంజీవి సస్పెన్స్ కొనసాగిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు.
2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి...నాటి ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. వైఎస్ మరణానంతరం సమైక్య రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీన ఒప్పందం మేరకు చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రి కావడం తెలిసిందే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి కేంద్రంలో అధికారం కోల్పోవడంతో చిరంజీవి కూడా సైలెంట్ అయిపోయారు. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చిరంజీవి పాలిటిక్స్లోకి రీ-ఎంట్రీ ఇవ్వకపోవడమే మంచిదని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.