జగన్ను గెలిపించండి: పవన్ కళ్యాణ్ మైక్ ఇస్తే షాకిచ్చిన రైతు, దటీజ్ జనసేనాని.. ఏం చేశాడంటే?
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆదివారం కర్నూలు, సోమవారం ఆదోనిలో పర్యటించారు. రెండో రోజు పవన్ పత్తి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రైతు ఆయనకు షాకిచ్చారు.
జగన్ సీఎం కావాలని పవన్ కళ్యాణ్ ఎదుట
నేను ఇక్కడకు మీ రైతుల సమస్యలు వినేందుకు వచ్చానని, మీ భవిష్యత్తు కోసమే వచ్చానని పవన్ చెప్పారు. అనంతరం ఓ రైతుకు మైకు ఇచ్చి సమస్యలు చెప్పమన్నారు. ఆ సమయంలో ఆ రైతు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అయితే, ఇలాంటి వాటిని జనసేనాని రాజకీయ కోణంలో ఆలోచించరని, ఇతర పార్టీల వలె తమకు అనుకూలంగా ఉన్నవారితో మాట్లాడించడని, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడినప్పటికీ వాటిని ఇతర పార్టీల్లా చూడరని జనసైనికులు చెబుతున్నారు.
ఇంతకీ ఆ రైతు ఏం చెప్పాడంటే?
కోతకు సిద్దంగా ఉన్న పత్తిపంట వర్షం రావడంతో నానిపోయిందని, పశువులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని, పశువులు లేనిది ప్రపంచం లేదని, ఏ ఉద్యోగస్తులు లేరని ఆ రైతు అన్నారు. అనంతరం జనసేనాని భుజంపై చేయి వేసిన ఆ రైతు.. మీరు జగన్మోహన్ రెడ్డిని గనుక గెలిపిస్తే.. మీరు.. మీరు (ఆయన్ను గెలిపిస్తే) ఆయనను బతిమిలాడైనా రైతులకు ఏం కావాలో అవి ఇప్పిస్తానని చెప్పారు. ఆయన మాటలకు ఆ సభకు వచ్చిన వారందరూ హర్షధ్వానాలు చేశారు.
నవ్వేశారు.. దటీజ్ పవన్ కళ్యాణ్
సదరు రైతు నోటి వెంట జగన్ను గెలిపించాలనే మాట రాగానే పవన్ కళ్యాణ్ దానిని ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదు. ఆయన మాట్లాడుతుంటే సరదాగా నవ్వారు. ఇతర పార్టీలు అయితే మైకులు లాగేసుకునే సందర్భాలు ఉండేవేమో. కానీ ఆయన మాట్లాడుతుంటే పవన్ మాత్రం స్వయంగా మైకును తన చేతిలో పట్టుకొని ఆయన మాట్లాడుతుంటే ఏమాత్రం అడ్డుకోకుండా విన్నారు. ఆ తర్వాత ఆ రైతు ఇంకా మాట్లాడుతూ.. దయచేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పారు. ఆ రైతు అలాగే ఉత్సాహంతో చాలాసేపు మాట్లాడే ప్రయత్నం చేయగా పవన్ ఆ తర్వాత ఇంకెవరైనా మాట్లాడుతారా అని మైక్ తీసుకున్నాడు.
సైగ చేసిన నాదెండ్ల మనోహర్
సదరు రైతు.. జగన్ ముఖ్యమంత్రిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ను కోరగా పక్కనే ఉన్న జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాత్రం కాస్త ఆందోళన చెందినట్లుగా కనిపించింది. రైతును ఆపమని చెబుతున్నట్లుగా వెనుక భుజం తట్టారు. కాని రైతు ఆగలేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ప్రసంగాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. రాజకీయ స్ఫూర్తి అంటే ఇదేనని చెబుతున్నారు. సాధారణంగా ప్రత్యర్థి గురించి మాట్లాడుతుంటే మిగతా పార్టీలు మైకులు లాగేసుకుంటాయని, కానీ పవన్ మాత్రం మైకు అలాగే పట్టుకొని, దాదాపు నిమిషం పాటు మాట్లాడనిచ్చారని, ఇదే ఆయన రాజకీయ స్ఫూర్తికి నిదర్శనమని చెబుతున్నారు. రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకు వస్తానని చెప్పిన జనసేనాని, తీరు హ్యాట్సాప్ అనేలా ఉందని చెబుతున్నారు.