కర్నూలు కలెక్టరేట్ ఎదుట కిరోసిన్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు గ్రామానికి చెందిన నారాయణ శెట్టికి గ్రామంలో 5 ఎకరాల 70సెంట్ల భూమి ఉంది.
ఈ పొలాన్ని గొల్ల రాములు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు. తన పొలం కౌలుకు చేస్తున్న గొల్ల రాములు, ఎమ్మార్వో, వీఆర్ఓలతో కలసి దొంగ పాస్ పుస్తకాలు సృష్టించారనేది నారాయణ శెట్టి ప్రధాన ఆరోపణ. తనకు న్యాయం చేయకపోతే కిరోసిన్ పోసుకుని ఇక్కడే నిప్పంటించుకుంటానని చెప్పి తనపై కిరోసిన్ పోసుకున్నాడు.
నిప్పంటించుకోబోతున్న సమయంలో అక్కడున్న వారు అప్రమత్తమై నారాయణ శెట్టిని పోలీసులకు అప్పగించారు. దీంతో నారాయణ శెట్టిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు.
బావిలో గుర్తుతెలియని మృతదేహం
బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించిన సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మోరంపల్లి గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వయసు 35 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, నాలుగు రోజుల క్రిందటే ఈ దారుణ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.