భూసేకరణకు రైతు బలి: ఆర్డీవో కార్యాలయంలో గుండెపోటు..
బాలు నాయక్(50) అనే రైతు కూడా ఈ సమావేశానికి వచ్చారు. భూముల ధరలకు సంబంధించి అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. తన భూమికి ఎక్కడ తక్కువ ధర నిర్ణయిస్తారోనన్న ఒత్తిడికి లోనయ్యాడు.
పెనుకొండ: పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతోన్న భూసేకరణ రైతుల ప్రాణాల మీదకు వస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. భూసేకరణ ద్వారా భూమి కోల్పోతున్న ఓ రైతు.. ఎక్కడ తక్కువ ధర చెల్లిస్తారోనన్న ఆవేదనతో గుండెపోటుకు గురయ్యాడు.
అనంతపురం జిల్లా పెనుకొండ ఆర్డీవో కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో కార్ల పరిశ్రమ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఇప్పటికే 600 ఎకరాలు ఇందుకోసం సేకరించగా.. మరో 1400 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే భూములిచ్చిన రైతులతో అధికారులు ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. బాలు నాయక్(50) అనే రైతు కూడా ఈ సమావేశానికి వచ్చారు. భూముల ధరలకు సంబంధించి అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో.. తన భూమికి ఎక్కడ తక్కువ ధర నిర్ణయిస్తారోనన్న ఒత్తిడికి లోనయ్యాడు.
భూమికి తక్కువ ధర నిర్ణయిస్తే ఇద్దరు కుమార్తెల వివాహం చేయడం కష్టమవుతుందన్న బాధలో బాలు నాయక్ ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన గుండెపోటుకు గురయ్యాడు. బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించినా.. బాలు నాయక్ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.