తుళ్లూరు సీఆర్డీఏ ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం
అమరావతి: గుంటూరు జిల్లాలోని తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం ఎదుటు ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... అనంతవరం గ్రామానికి చెందిన గుమ్మా రాంబాబు అనే రైతుకు సీఆర్డీఏ పరిధిలో ఓ చోటు రెండెకరాలు, మరోచోట 47 సెంట్ల భూమి ఉంది.
ఈ మొత్తం భూమిని నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణకు ఇచ్చాడు. ఇందులో 47 సెంట్ల భూమికి మొదటి సంవత్సరం కౌలు అందజేశారు. సర్వే చేసి 44 సెంట్లే భూమే ఉందని అధికారులు తేల్చారు. అదే ప్రకారం రికార్డులలో నమోదు చేశారు.
అయితే తన వద్ద ఉన్న ల్యాండ్ డాక్యమెంట్స్ ప్రకారం 47 సెంట్లు ఉందని రాంబాబు అధికారులకు చెబుతూ వచ్చాడు. దాని ప్రకారం సర్వేలో లెక్కకు రాకున్న భూమిని తేల్చాలంటూ అధికారులను కలుస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం కూడా తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో భూ వ్యవహారాల డైరెక్టర్ చెన్నకే శవరావుకి తన సమస్యను మొరపెట్టుకున్నాడు.
ల్యాండ్ డాక్యుమెంట్స్ చూసిన తగిన చర్యలు తీసుకుంటామని రాంబాబుకు చెన్నకేశవరావు చెప్పారు. అయితే గతేడాది కాలంగా ఇదే విధంగా చెబుతున్నారని మనస్తాపం చెందిన రాంబాబు తన వెంట తెచ్చుకున్న పెట్రోలును మీద పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.
ఇది గమనించిన పోలీసు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. వెంటనే తుళ్లూరు ఎస్ఐ షఫీకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఐ షఫీ బాధిత రైతుకు నచ్చజెప్పి సీఆర్డీఏ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. దీంతో శుక్రవారం సాయంత్రానికి సమస్యను పష్కరిస్తామని అధికారులు రైతుకు హామీ ఇచ్చారు.