రాళ్లతో కొడ్తారు, బాబు పుష్కరాల సినిమాకోసం 27మంది బలి: జగన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు.
రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన మూడో విడత దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని శెట్టూరులో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా ఆయన నెరవేర్చలేదన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారన్నారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు.
రుణమాఫీపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తే, రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారని చెప్పారని, తనకు సన్మానాలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఇప్పుడు వారు రాళ్లతో కొట్టేలా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
గతంలో వడ్డీలేని రుణం వస్తే ఇప్పుడు రైతులు 14 శాతం అదనంగా వడ్డీలు కడుతున్నారని మండిపడ్డారు. పుష్కరాల్లో సినిమా తీసేందుకు 27 మందిని బలి తీసుకున్నారన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారన్నారు. గతంలో కరెంట్ బిల్లు రూ.200 వస్తే ఇప్పుడు రూ.800 వస్తోందన్నారు.