పోలీసుల దాష్టీకం: అన్నదాతలపై విరిగిన లాఠీ!
విజయవాడ: అన్నం పెట్టే రైతన్నలపై లాఠీ విరిగింది. తలలు పగిలాయి. నష్టపరిహారం కోసం గొంతెత్తిన రైతులపై పోలీసులు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. రెక్కలు పట్టుకుని ఈడ్చి పడేాశారు. కేసులు నమోదు చేశారు. లాకప్పుల్లో పడేశారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు చేసిన లాఠీ ఛార్జీలో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ ఘటనతో నందిగామ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఎం జగన్మోహన్ రావు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రైతులను పరామర్శించారు.
నష్ట పరిహారం చెల్లించకుండా..
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు కేతవీరునిపాడులో హైటెన్షన్ విద్యుత్ టవర్ల నిర్మాణానికి పూనుకున్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధీనంలో పని చేస్తుంది. టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రైతుల నుంచి సేకరించారు. ఈ గ్రామం మొత్తంలో 12కు పైగా విద్యుత్ టవర్లను నిర్మించాల్సి ఉంది. దాదాపు అన్ని టవర్లు కూడా రైతుల పొలాల్లోనే నిర్మించాల్సి రావడంతో.. పవర్ గ్రిడ్ అధికారులు రైతులతో సంప్రదించారు. నష్టపరిహారాన్ని ఒప్పించారు. తాము ఆశించిన మేర పరిహారం అందబోతుండటంతో రైతులు దీనికి అంగీకరించారు. అక్కడిదాకా బాగానే ఉంది. పరిహారం చెల్లిస్తామన్న అధికారులు ఆ తరువాత జాప్యం చేశారు. వాటిని చెల్లించకుండానే పొలాల్లో టవర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఒక్కసారి టవర్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తే- ఇక పరిహారం అందదనే భయాందోళనలను రైతుల్లో వ్యక్తమయ్యాయి.
నిర్మాణ పనులను అడ్డగించిన రైతన్నలు..
టవర్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోన్న అధికారులు రైతులు అడ్డుకున్నారు. ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారాన్ని చెల్లించకుండా టవర్లను ఎలా నిర్మిస్తారంటూ నిలదీశారు. తమకు తెలియకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా, పరిహారం మాటే ఎత్తకుండా పొలాల్లో టవర్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి వీలు లేదంటూ రైతులు అధికారులను అడ్డుకున్నారు. అధికారుల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అధికారులు వీరులపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. రైతులను ఒప్పించడానికి ప్రయత్నించారు. పరిహారం ఇవ్వకుండా తమ వ్యవసాయ పొలాలను ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. అక్కడే బైఠాయించారు.
లాఠీలకు పని చెప్పిన పోలీసులు..
నిర్మాణ పనులను అడ్డుకోవడంపై ఆగ్రహించిన పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. రైతన్నలపై లాఠీ ఛార్జీ చేశారు. పొలాల్లో బైఠాయించి, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతుల రెక్కలు పట్టుకుని లాగి పడేశారు. బలవంతంగా తమ వాహనాల్లోకి ఎక్కించారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల చర్యలను రైతులు ప్రతిఘటించడంతో తోపులాట చోటు చేసుకుంది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలియడంతో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ ఎం జనార్ధన్ రావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రైతులను పరామర్శించారు. జనార్ధన్ రావు రైతుల తరఫున పవర్ గ్రిడ్ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. బాధిత రైతులకు పరిహారాన్ని ఆరురెట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో పరిస్థితులు సద్దుమణిగాయి.