టిడిపికి మరో దెబ్బ...ఇన్నర్ రింగ్ రోడ్డు వద్దంటూ రాజధాని రైతుల ఆందోళన
అమరావతి: వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎదురు ఈదుతున్న టిడిపికి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అప్పుడే వద్దంటూ రాజధాని ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు, రైతు సంఘాలు, సిపిఎం నేతలు విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయం ఎదుట శనివారంనాడు ధర్నా నిర్వహించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఏకపక్షంగా విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ వందలాది మంది రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉందని వివిధ రైతు సంఘాలు, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఇది సరి కాదు...రైతు సంఘాల ఆందోళన...
సిఆర్డిఏ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పలు రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 42 గ్రామాల్లో 3,600 ఎకరాలకు పైగా పంట భూములను తీసుకోవాలని నిర్ణయించడం సరి కాదన్నారు. తాము ఇన్నర్ రింగ్ రోడ్డకు వ్యతిరేకం కాదని, ఇప్పటికే తీసుకున్న భూములను పూర్తి స్థాయిలో అభివృద్ధికి వినియోగించిన తర్వాతనే ఇతర భూములను తీసుకునే ప్రయత్నం చెయ్యాలని అన్నారు.
అఖిలపక్షం వెయ్యాలి...సిపిఎం డిమాండ్
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ గత నెలలో విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ను తక్షణమే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై అభ్యంతరాలు తెలియజేసేందుకు మార్చి 19వ తేదీ తుది గడువుగా నిర్ణయించగా, అ గడువు ఇంకా పొడిగించాలని కోరారు.
రైతుల అభ్యంతరాలు...వెల్లువ...
ఇన్నర్ రింగ్ రోడ్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై పలు గ్రామాలకు చెందిన రైతులు విజయవాడలోని సీఆర్డీయే కార్యాలయంలో తమ అభ్యంతరాలు, సూచనలు అందజేశారు. సోమవారంతో అభ్యంతరాలు తెలియజేసే గడువు ముగియనున్నందునో...లేక రాజకీయంగా మారిన పరిణామాల కారణంగానో...గత నెల 18వ తేదీ నుంచి ఇప్పటివరకు రోజుకు కొన్ని అభ్యంతరాలు దాఖలవుతుండగా శనివారం వాటి సంఖ్య అమాంతం పెరిగింది. అలాగే ఆన్లైన్లోనూ అందుతున్న అభ్యంతరాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నట్లు తెలిసింది.
ప్రభుత్వం దృష్టికి అభ్యంతరాలు...సిఆర్డిఏ
ధర్నా అనంతరం రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, సిపిఎం నాయకుడు బాబూరావు నేతృత్వంలో సీఆర్డీయే ప్రత్యేక కమిషనర్ వి.రామమనోహరరావును కలిసి ఇన్నర్ రింగ్ రోడ్డుపై తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేశారు. ఐ.ఆర్.ఆర్. ప్రతిపాదిత మార్గం చుట్టూ వెంచర్లు, నిర్మాణాలపై అమలు పరుస్తున్న అనధికారిక ఆంక్షలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు ఇచ్చిన తుది గడువును పొడిగించాలని కోరారు. రైతుల వినతులపై స్పందించిన సీఆర్డీయే ప్రత్యేక కమిషనర్ వి.రామమనోహరరావు రైతులు, రైతు ప్రతినిధులు తెలిపిన అభ్యంతరాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.అమరావతిలో రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఐ.ఆర్.ఆర్ రోడ్డుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు ఆయన వివరించారు.