జనాల్ని వణికించిన కింగ్ కోబ్రా జంట పాముల హతం
శ్రీకాకుళం: జిల్లాలోని మందస పట్టణం పరిసర ప్రాంతాల్లో గత కొంత కాలంగా హల్ చల్ చేస్తున్న కింగ్ కోబ్రా జంట పాములను స్థానికులు ఎట్టకేలకు హతమార్చారు. దీంతో మందస పట్టణం వాసులతో పాటు చిన్న బరంపురం, బుడంబో, కలువమ్మతల్లి ఆలయం తదితర ప్రాంతాల వాసులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
కారణం స్థానికంగా వైరాగి నాగులుగా పిలిచే ఈ కింగ్ కోబ్రాలు పాముల్లోనే అత్యంత పొడవుగా పెరగడమే కాకుండా పాయిజన్ పరంగా కూడా అత్యంత విషపూరితమైనవి కావడంతో ప్రజలు వీటి ఉనికి గమనించినప్పుడల్లా తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యేవారు. పైగా ఒక కింగ్ కోబ్రాని చూస్తేనే గుండాగి పోయేంత భయాందోళనలకు లోనయ్యే పరిస్థితుల్లో ఇక్కడ రెండు అతి పొడవైన కింగ్ కోబ్రాల జంట పట్టపగలే సంచారం చేస్తుండటంతో స్థానికుల ఆందోళనకు అంతు లేకుండా పోయింది.
ఈక్రమంలో సోమవారం మరోసారి సుమారు 15 అడుగులు పొడవు ఉన్న ఈ కింగ్ కోబ్రాల జంట మందస పట్టణంలో కనిపించగానే గ్రామంలో అలజడి రేగింది. అనంతరం ఇవి రెండూ కలసి ప్రయాణిస్తూ సమీపంలోని పంట పొలాల్లో ప్రవేశించాయి. అక్కడ పొల్లాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు వీటి బుసలు విని ఆచూకీ గుర్తించారు. అయితే ఇవి కూడా 5 అడుగుల మేరా పైకి లేచి సవాలు చేస్తున్నట్లు మరింత భయంకరంగా బుసలు కొట్టాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గత కొంతకాలంగా చుట్టుప్రక్కల గ్రామాల్లో సంచరిస్తూ ఉన్న ఈ వైరాగి నాగుల జంటతో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన రైతులు, కూలీలు వీటిని హతమార్చాలని నిర్ణయించారు. అప్పటివరకూ వీటి సమీపంలోకి కూడా వెళ్లడానికి భయపడిన వీరు ఆ తరువాత అందరూ కలసి సాహసించి పదునైన పనిముట్ల సాయంతో వీటిని హతమార్చారు. ఒకేసారి రెండు నాగుపాములు హతం కావడంతో ఇకపై వీటి బెదడ తీరిపోయిందని సంతోషించారు.