రైతుల ఉద్యమం బోగస్ ..రాజధాని రైతుల ఆందోళనలపై మంత్రి ధర్మాన తీవ్ర వ్యాఖ్యలు
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది .సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. 29 గ్రామాలు ఏదో ఒక రూపంలో ఆందోళన చేపడుతూనే ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులంతా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని రైతుల ఆందోళనలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలు
ఇక ప్రతిపక్ష పార్టీలు టిడిపి, జనసేన, బిజెపిలు రాజధాని రైతులకు మద్దతుగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని పునరాలోచించాలని, రాజధాని మార్పు అనర్థదాయకం అని తేల్చి చెబుతున్నాయి.
ఇక ఈ క్రమంలోనే వైసీపీ నేతలు రాజధాని రైతుల ఆందోళనలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.పెయిడ్ ఆర్టిస్ట్ లతో ఆందోళన చేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్నది టీడీపీ కార్యకర్త లేనని విమర్శలు గుప్పిస్తున్నారు.
రైతుల ఉద్యమం బోగస్ అంటూ ధర్మాన వ్యాఖ్యల దుమారం
ఇక తాజాగా మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఉద్యమం బోగస్ అని అందులో ఉన్నవారంతా టీడీపీ కార్యకర్తలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పత్రికల్లో బొమ్మలు వస్తున్నాయని, వాటిని చూసుకోవడం కోసమే కొంతమంది ఆందోళన చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.
పోరాటం చేస్తున్నట్టు బిల్డప్.. పేపర్లలో బొమ్మలకోసమే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాంటి సదుపాయం కల్పించినందుకు జై అంటామని పేర్కొన్న ధర్మాన ప్రసాదరావు రాజధానిలో లింగులింగుమంటూ ఓ ఎనిమిది గ్రామాల వాళ్లు మాత్రం గొప్ప పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఆయన హేళనగా మాట్లాడారు. పేపర్ల కవరేజ్ కోసమే అన్నట్టు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు 70 ఏళ్లుగా దిక్కులేకుండా బతుకుతున్నారని, అలాంటి తమకు లేని పోరాటం మీకెందుకు అంటూ రాజధాని ప్రాంత రైతులు ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేశారు.
70 ఏళ్ళుగా దయనీయంగా ఉన్న ఉత్తరాంధ్రలో మాకు లేని పోరాటం మీకెందుకు అని ప్రశ్న
తాగడానికి నీళ్ళు కూడా లేకుండా దయనీయంగా బతుకుతున్నామని ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇలాంటి పప్పులేం ఉడకవని, అమరావతి రైతుల ఉద్యమం బోగస్ అని ధర్మాన చేసిన వ్యాఖ్యలు రాజధాని రైతులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. నిన్నటికి నిన్న స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా రాజధాని రాజస్థాన్ ఎడారిలా ఉందని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా రాజధాని రైతుల పోరాటం బోగస్ అని ధర్మాన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.