మంత్రి బొత్సా వ్యాఖ్యలపై భగ్గుమన్న రాజధాని రైతులు..వెలగపూడి వద్ద రాస్తారోకో
Recommended Video
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయి . రాష్ట్ర రాజధాని అమరావతి సురక్షితం కాదని బొత్సా అభిప్రాయం వ్యక్తం చేశారు. వరద ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారో అర్ధం కావట్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు గతంలో శివరామ కృష్ణ కమిటీ కూడా అదే చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీనిమీద మళ్లీ చర్చించాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
అయితే బొత్సా సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం లేచింది. అయినా మరోసారి బొత్సా తాను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. దీంతో రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి తమ గోడు విన్నవించుకున్న రైతులు మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన బాట పట్టారు.
మంత్రి వ్యాఖ్యలకు నిరసన ..రహదారిపై బైఠాయించి రాజధాని రైతులు ఆందోళన
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతిలో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని వైసిపి సర్కార్ మొదటి నుండి ఆరోపణలు గుప్పిస్తోంది. అమరావతిలో రైతుల వద్ద నుండి భూమి బలవంతంగా లాక్కున్నారని, బినామీల పేర్లతో భూములను టిడిపి నాయకులు కొనుగోలు చేశారని వైసిపి నేతలు ఆరోపించారు. దీంతో రాజధాని నిర్మాణం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే రాజధాని నిర్మాణం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో బొత్సా వ్యాఖ్యలు రాజధాని మార్చే కుట్ర తప్ప మరోటి కాదని రైతులు ఆరోపిస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు తుళ్లూరు మండలం వెలగపూడిలో రాస్తారోకో నిర్వహించారు. వాహనాలను నిలిపివేసి రహదారిపై బైఠాయించిన రైతులు రాజధాని ముంపు ప్రాంతంలో లేదని, రాజధానిని తరలించే యోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు.
రాజధాని మారుస్తారన్న వార్తలతో రాజధాని రైతుల్లో టెన్షన్ .. పవన్ తో భేటీ
ఏపీలో రాజధాని విషయంలో జరుగుతున్న హై డ్రామా నేపధ్యంలో రాజధాని రైతులు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ఇక ఆ తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన రైతులు తమ గోడు పవన్ కు చెప్పుకున్నారు. రాజధానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదన్న రైతులు రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మూడునెలలుగా రైతులు దారుణ పరిస్థితులు చూస్తున్నామన్నారు. రైతులకు కౌలు డబ్బులు కూడా ఇవ్వలేదని వారు పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్నారు .ఇక పవన్ రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చారు.
సుజనా చౌదరిని కలిసిన రాజధాని రైతులు .. అండగా ఉంటానని చెప్పిన సుజనా చౌదరి
ఇక ఆ తర్వాత బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిశారు రైతులు .అవకాశం ఇస్తే అమిత్ షా ను కలవాలనుకున్నా అరుణ్ జైట్లీ మృతితో అమిత్ షా త్వరగా తిరుగు ప్రయాణం అయ్యారు కాబట్టి ఆయనను కలవలేదు రాజధాని రైతులు. కానీ సుజనా చౌదరిని కలిసి తమ పరిస్థితి తెలియజేశారు రైతులు . రాజధాని అమరావతి విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి రైతులకు చెప్పారు . రాజధాని నిర్మాణంపై మంత్రులు మాత్రమే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన సీఎం జగన్ ఇంకా ఏ విధమైన ప్రకటన చెయ్యలేదని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మంత్రుల ప్రకటనలతోపాటు తాము ఎందుర్కొంటున్న సమస్యలను సుజనాచౌదరికి వివరించారు. రైతులకు బాసటగా ఉంటానని ,రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందనే వ్యాఖ్యలు దురాలాచోనతో చేసినవి అంటూ చెప్పుకొచ్చారు సుజనా చౌదరి . రైతులు భయపడాల్సిన అవసరం లేదని , బీజేపీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.