వెలగపూడి నుండి కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో రైతుల పిటిషన్.. రేపు విచారణ
ఏపీలో రాజధాని అమరావతిని తరలించాలని వైసీపీ సర్కార్ ఆలోచన చేస్తున్న నాటి నుండీ రాజధాని ప్రాంత రైతులు కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు. రాజధాని ఏర్పాటుకోసం వేసిన కమిటీలపై కూడా కోర్టులో పలు పిటీషన్లు వేశారు రైతులు. ఇక తాజాగా మరోమారు శాసనమండలి రద్దుపై కోర్టును ఆశ్రయించిన రైతులు , శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్ రాజధాని కార్యాలయాల తరలింపు నిర్ణయం తీసుకోవటంపై కోర్టును ఆశ్రయించారు.
అర్దరాత్రి ఉత్తర్వులతో ఏపీ ప్రభుత్వ సంచలనం .. తొలిగా కర్నూలులో వికేంద్రీకరణకు ఆదేశం
పరిపాలనా వికేంద్రీకరణ మొదలుపెట్టిన ఏపీ సర్కార్
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఏపీ సర్కార్ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఉగాది నుండి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖ నుండి నిర్వహిచాలని సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని అన్న ఊసు లేకుండా విశాఖ నుండి పాలన సాగించాలని ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్ . ఇక మూడు రాజధానుల నిర్ణయానికి తగ్గట్టుగా పరిపాలనా వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్న జగన్ రాజధాని తరలింపు, కార్యాలయాల తరలింపు అధికారికంగా మొదలు పెట్టేశారు .
కర్నూలుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల తరలింపు
తాజాగా కర్నూలుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాల్ని వెలగపూడి నుండి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది . ఇకపై ఆ కార్యాలయాలు కర్నూలు నుండి పనిచేయనున్నాయి. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వెయ్యటం , విశాఖ నుండి పాలన చెయ్యాలనుకోవటం వంటి అంశాలు ఇప్పుడు రాజధాని ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో మరోమారు కోర్టు మెట్లెక్కారు రాజధాని రైతులు .
హైకోర్టులో కార్యాలయాల తరలింపుపై రాజధాని రైతుల పిటీషన్ .. రేపు విచారణ
వెలగపూడిలో ఉన్న కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇకే ఈ పిటీషన్ లో జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్, సీఆర్డీఏను ప్రతివాదులుగా చేర్చి పిటిషనర్ పిటీషన్ వేశారు . ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ చెయ్యనుంది.