ఏపి రాజధాని ప్రాంత రైతుల వినూత్న నిరసన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రైతుల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. కొత్త రాజధాని నిర్మాణానికి భూసేకరణ విషయంలో ఆ ప్రాంత రైతులు వినూత్న రీతిలో తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వలేమని చెప్పారు.
రాజధాని పరిధిలోని తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు ల్యాండ్ పూలింగ్కు తమ భూములు ఇవ్వమని పొలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు. మొదటి నుంచి ఈ ప్రాంత రైతులు మూడు పంటలు పండే తమ భూములు ఇవ్వమని ప్రభుత్వానికి చెబుతున్నారు. తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు.
అటవీ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగులు
చిత్తూరు: జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏనుగులు గురువారం బీభత్సం సృష్టించాయి. ఓ అటవీ ఉద్యోగిని తొక్కి చంపాయి. రామకుప్పం మండలం ననియాల గ్రామంలో అటవీశాఖ ఉద్యోగి మునియప్పపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు తొక్కడంతో మునియప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా, గత కొంత కాలంగా ఏనుగులు పంట పొలాలపై తరచుగా దాడులు చేస్తున్నాయి. పంట పొలాల మీద పడి పంటను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల భీభత్సంతో లక్షల రూపాయల పంటలు నాశనమవుతున్నాయని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను పంట పొలాల్లోకి ారకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.